వెంకయ్య మొర ఆలకించలేదేంటి : ఆ నలుగురు అధికారిక విలీనం: చక్రం తిప్పిందెవరు..!
వెంకయ్య నాయుడూ టీడీపీ మొర ఆలకించలేదు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. అదే సమయంలో రాజ్యసభలో టీడీపీకి ఉన్న ఆరుగురిలో నలుగురి నిర్ణయం మేరకకు టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. రాజ్యంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం విలీనం కోరినట్లు చెప్పారు. అయితే, అది రాజ్యంగ విరుద్దమని..రాజ్యసభ చైర్మన్ హోదాలో అది వెంకయ్య నాయుడు అంగీకరించరని టీడీపీ ఆశలు పెట్టుకుంది. కానీ ఆయన వారి మొర ఆలకించలేదు. విలీన ప్రక్రియ పూర్తి చేసారు. ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిందెవరు...
వెంకయ్య ఆమోదించారు..
టీడీపీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోద ముద్ర వేసారు. మొత్తం వ్యవహారం 24 గంటల్లోనే ముగిసిపోయింది. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మొత్తం ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వేంకటేష్, గరికపాటి మోహనరావు టీడీపీని వీడాలని నిర్ణయించారు. అందులో భాగంగా వారు తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారితే ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది. అదే సమయంలో రాజీనామా చేసే అవకాశాలు లేవు. దీంతో...వారు ఏకంగా మెజార్టీ సభ్యుల నిర్ణయం అని చెబుతూ రాజ్యసభ టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ అందించారు . అటు నుండి బీజేపీ సైతం టీడీపీపీని తమ పార్టీలో విలీనం చేయటానికి అంగీకారం తెలుపుతూ లేఖ ఇచ్చింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఛైర్మన్ హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు ఈ ప్రక్రియకు బ్రేక్ వేస్తారని ఆశలు పెట్టుకున్నారు.
ఇక నుండి వారు బీజేపీ సభ్యులే..
టీడీపీ నేతలు ఆశలు..నిరీక్షణ ఫలించలేదు. ఎంత వేగంగా టీడీపీ సభ్యులు బీజేపీలో చేరారో అంతే వేగంగా ఛైర్మన్ వెంకయ్య నాయుడు సైతం టీడీపీపీ విలీనంకు ఆమోద ముద్ర వేసారు. రాజ్యాంగ పరంగా విలీనం చెల్లదని..వారివి ఖచ్చితం పిరాయింపుల కిందకే వస్తాయని టీడీపీ నేతలు వాదించారు. దీని పైన అభ్యంతరం తెలుపుతూ లేఖలు ఇచ్చారు. ఈ అభ్యంతరాలతో వెంకయ్య నాయుడు తుది ఆమోదం తెలపటానికి సమయం తీసుకుంటారని.. దీని పైన ఆ నలుగురు సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తుందని టీడీపీ ఆశించింది. అయితే, వారు అనుకున్నట్లుగా జరగ లేదు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్య నాయుడు ఆమోదించటం ..అదే విధంగా ఆ నలుగురి పేర్లను టీడీపీ రాజ్యసభ సభ్యుల జాబితా నుండి తొలిగించి బీజేపీ సభ్యుల లిస్టులో చేర్చటం జరిగిపోయింది. అధికారికంగా రాజ్యసభ వెబ్సైట్ సైతం వారి పేర్లను బీజేపీ జాబితాలోనే చూపిస్తోంది.
వేగంగా అడుగులు ..చక్రం తిప్పిందెవరు..
టీడీపీ సభ్యులు బీజేపీలో చేరాలని నిర్ణయించిన సమయం నుండి అడుగులు వేగంగా పడ్డాయి. ఆ నలుగురు సభ్యులు తొలుత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయనతో చర్చలు పూర్తయిన తరువాత విలీన ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా..హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి అప్పగించారు. వారు వెంటనే కావాల్సిన విధంగా లేఖలు సిద్దం చేయటం..వెంకయ్య నాయుడుతో సమావేశం అవ్వటం..ఆ నలుగురినీ బీజేపీలో చేర్చుకోవటం చకాచకా పూర్తయ్యాయి. ఇక, న్యాయ పరంగా..సాంకేతికంగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా.. వెంకయ్య నాయుడు అభ్యంతరం చెప్పకుండా పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి అమిత్ షా బాధ్యతలు అప్పగించారు. అంతే ఆయన రాజ్యసభ ఛైర్మన్తో టచ్లో ఉంటూ ఆమోద ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా చేసారు. ఆ వెంటనే రాజ్యసభ వెబ్సైట్లోనూ ఇదే విషయం స్పష్టం చేస్తూ వారిని బీజేపీ సభ్యులుగా ప్రకటించారు.