రోజాపై క్లారిటీ ఇస్తా, ఆ దమ్ముంది: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై రాకేష్ రెడ్డి సంచలనం
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మించనున్నారని వర్మ తెలపడంతోనే ఈ వివాదం మరింత రాజుకుంది. దీని వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, రాకేష్ రెడ్డికి సినిమా నిర్మించేంత స్థోమత
అమరావతి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పేరుతో లక్ష్మీపార్వతి, దివంగత మాజీ ఎన్టీఆర్లపై సినిమా ప్రకటించిన నాటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది.
కౌంటర్లు-సెటైర్లు..
ఇప్పటికే టీడీపీ నేతలు రాంగోపాల్ వర్మ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతే ధీటుగా వర్మ కూడా సమాధానాలు చెప్పారు. చివరకు సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ వివాదంపై కలగజేసుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తమ నేతలకు సూచించాల్సి వచ్చింది.
వైసీపీ నేతతోనే రాజుకున్న వివాదం
అయితే, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మించనున్నారని వర్మ తెలపడంతోనే ఈ వివాదం మరింత రాజుకుంది. దీని వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, రాకేష్ రెడ్డికి సినిమా నిర్మించేంత స్థోమత లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తుండటమే ఇందుకు కారణం.
పెద్దాయనంటే గౌరవం..
తాజాగా రాకేష్ రెడ్డి ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా విషయాలను, విశేషాల గురించి మాట్లాడారు. ‘పెద్దాయనకి నేను పెద్ద అభిమానిని. ఈ చిత్రం నిర్మించే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా' అని చెప్పారు.
రోజాపై క్లారిటీ ఇస్తా..
అంతేగాక, ‘లక్ష్మీపార్వతి పాత్రలో రోజా నటిస్తున్నది, లేనిది త్వరలోనే ప్రకటిస్తాం. ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఎటువంటి సమస్యలు ఎదురైనా సినిమాని మాత్రం పూర్తి చేసే తీరతా' అని రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆ దమ్ముంది నాకు..
‘నేను కూడా రాయలసీమలోనే పుట్టా! నాకు ఈ సినిమా తీసేంత స్థోమత లేదనే వార్తలు విన్నాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసే దమ్ము నాకుంది. నా దగ్గర డబ్బులేదని, జగన్ ఈ సినిమా నిర్మిస్తున్నారనే వార్తలు నిజం కాదు' అని రాకేష్ రెడ్డి కొంత ఆవేశంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతల స్పందన ఎలావుంటుందో చూడాలి.