స్టీల్ ప్లాంటు భిక్షకాదు...రాయలసీమ హక్కు;ఉద్యమం ఆగదు:ప్రవీణ్ కుమార్ రెడ్డి
కడప: స్టీల్ ప్లాంటు భిక్ష కాదు రాయలసీమ బిడ్డల హక్కు అంటూ వేలాది మంది యువత, స్థానిక ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీకి కడప జిల్లా ప్రొద్దుటూరు బుధవారం వేదికగా మారింది. గాంధీ రోడ్డులోని వన్టౌన్ సర్కిల్ నుంచి గాంధీరోడ్డుమీదుగా టిబి రోడ్డు, రాజీవ్ సర్కిల్ నుంచి శివాలయం సర్కిల్ వరకు ఈ భారీ ర్యాలీ సాగింది.
ప్రొద్దుటూరులో స్టీల్ ప్లాంటు సాధనా సమితి అధ్యక్షులు జీవి.ప్రవీణ్ కుమార్రెడ్డి అధ్వర్యంలో సాగిన ఈ రాయలసీమ మార్చ్ ఫర్ స్టీల్ ప్లాంటు ర్యాలీకి వేలాదిమంది యువత తరలిరాగా, ఉక్కు పరిశ్రమ కోసం నినదిస్తున్న వీరి గొంతుకలతో ప్రొద్దుటూరు పట్టణం వీధులు మార్మోగిపోయాయి. ర్యాలీ అనంతరం పుట్టపర్తి సర్కిల్లో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు తీవ్రమైన అన్యాయాల గురించి వివరించారు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా రాష్ట్ర విభజన తరువాత ఒక్క రాజకీయ నాయకుడూ మాట్లాడకపోవం పట్ల దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్కు పరిశ్రమ ఇస్తామని...కాలయాపన...
‘‘అనంతపురంకు ఎయిమ్స్ ఇస్తామని చెప్పి దాని ఊసే లేకుండా చేశారు. అలాగే కడపకు ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పిమోసం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వారి వారి లబ్ధికోసం ఏకమైన విషయం గుర్తు చేస్తూ, రాయలసీమకు రావాల్సిన స్టీల్ ప్లాంటు విషయంలో ఇదే రాజకీయ పార్టీలు ఎందుకు ఏకం కావో కావడం లేదో చెప్పాలని,''...స్టీల్ ప్లాంటు సాధనా సమితి అధ్యక్షులు జీవి.ప్రవీణ్ కుమార్రెడ్డి ప్రశ్నించారు.
చిత్తశుద్ది ఉంటే...అఖిలపక్షానికి రండి...
రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ది ఉంటే స్టీల్ ప్లాంటు ఉద్యమం పుట్టిన ప్రొద్దుటూరు పట్టణం నడిబొడ్డున మేం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలని, ఇక్కడ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వాలపై వత్తిడి తేవాలని ప్రవీణ్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. కేవలం పత్రికా ప్రకటనలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ఉక్కు పరిశ్రమకోసం పోరాడే రాజకీయ పార్టీలకు ఉక్కు సైనికులు బ్రహ్మరథం పడతారని ఆయన స్పష్టం చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా స్టీల్ ప్లాంటు కోసం పోరాటం చేస్తున్నామని, రాయలసీమ బిడ్డ వలసలు పోయి ఎక్కడో బానిస బతుకు బతకూడదన్న ఉద్దేశ్యంతోనే పోరాటం చేస్తున్నట్లు ప్రవీణ్రెడ్డి వివరించారు. ప్రొద్దుటూరులో పదిమందితో మొదలైన ఈ ఉద్యమం వేలాది మంది నుంచి లక్షలాది మందితో ఉదృతమైందన్నారు.
సాధ్యాసాధ్యాలపై...కమిటీ వేయడం ఏంటి?
స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయమని ఒకవైపు తాము ఉవ్వెత్తున ఉద్యమం చేస్తుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే విషయమై సాధాసాధ్యాలపై కమిటీ వేయడం ఏమిటని ప్రవీణ్ కుమార్రెడ్డి ప్రశ్నించారు.స్టీల్ ప్లాంటు వల్ల ప్రయోజనం, లాభాలు లేకపోతే బ్రహ్మణీ సంస్థ ఇక్కడ పరిశ్రమ పెట్టేందుకు ఎందుకు ముందుకు వస్తుందని, ఈ కనీస విషయాలను గుర్తించకుండా కమిటీ వేయడం దారుణమన్నారు. వచ్చిన కమిటీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిజాయితీగా స్టీల్ ప్లాంటు ఉద్యమం చేస్తున్నా మాపై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తినని, స్టీల్ ప్లాంటు కోసం కుటుంబాన్నైనా త్యాగం చేసి పోరాడుతానని పేర్కొన్నారు.
ఉక్కు పరిశ్రమ సాధించే వరకు...ఉద్యమం ఆగదు...
ఏ ఒక్కరి దగ్గరా ఏమీ ఆశించకుండా స్వంత డబ్బులతో ఉద్యమం చేపడుతున్నామన్నారు. ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామే తప్ప మరో ఆలోచనే మా మదిలో లేదన్నారు. ప్రొద్దుటూరు స్టీల్ సిటీ అయ్యేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. రాయలసీమ తల్లికి పుట్టిన బిడ్డలైతే రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంటు కోసం తనలాగే రోడ్డెక్కి నినదించాలని, ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆయన రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాసంఘాలు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, ఐఎంఏ, ఇతర సంస్థలు మద్దతు ఇచ్చి పాల్గొన్నాయి.
Recommended Video
కడప జిల్లా బంద్ కు...అఖిల పక్షం పిలుపు
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప్రజా, విద్యార్ధి సఘాలు
కూడా
మద్దతు
తెలపటంతో
తెల్లవారుజామునుంచే
అఖిలపక్ష
నేతలు
కడప
బస్
స్టాండ్
లో
బస్సులను
అడ్డుకున్నారు..బంద్
నేపథ్యంలో
భారీ
బందోబస్తు
ఏర్పాటు
చేసిన
పోలీసులను
ఆందోళనకారులను
అరెస్ట్
చేసి
స్టేషన్
కు
తరలించారు.