చిన్నగా మొదలై...: రామ్ చరణ్ తేజ గగన విహారం!
హైదరాబాద్: కేంద్రమాజీ మంత్రి చిరంజీవి తనయుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అన్నీ సజావుగా సాగితే తెలుగు వారికి చెందిన రెండో విమానయాన సంస్థ టర్బో మేఘ నవంబరులో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
రెండు రోజుల క్రితం విమానయాన శాఖ నుండి ఆరు సంస్థలు అనుమతి పొందాయి. అందులో చెర్రీకి చెందిన టర్బో మేఘ కూడా ఉంది. విమానయాన శాఖ నుండి కంపెనీకి అనుమతి లేఖ కూడా వచ్చిందట. నిధుల సమీకరణ, విమానాల లీజుకు తీసుకునే ప్రక్రియను ప్రారంభించేందుకు త్వరలో ప్రారంభిస్తారట.
ఒకటి రెండు నెలల్లో ఫ్లయింగ్ లైసెన్స్ కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు దరఖాస్తు చేసుకోనున్నారట. టర్బో మేఘకు రామ్ చరణ్ తేజతో పాటు వంకాయలపాటి ఉమేష్ డైరెక్టర్లుగా ఉన్నారు. మూడు క్యూ 400 బంబార్డియర్ లేదా ఏటీఆర్ విమానాలతో కంపెనీ సేవలను ప్రారంభించనుందని తెలుస్తోంది. ఈ విమానాలలో 68 సీట్లు ఉంటాయి.
రామ్ చరణ్ తేజ
వందకు పైగా సిబ్బందితో కార్యకలాపాలను ప్రారంభించనుందట. ఇందులో 30 మంది పైలట్లు, ఇరవై మంది వరకు ఎయిర్ హోస్టెస్లు ఉండవచ్చునంటున్నారు.
రామ్ చరణ్ తేజ
తొలుత రీజినల్ స్థాయిలో సేవలు అందించాక.. జాతీయస్థాయికి ఎదగాలని కంపెనీ భావిస్తోందట. విమానాల సంఖ్యను కూడా పెంచుకోవాలని చూస్తోందట.
రామ్ చరణ్ తేజ
పెద్ద కంపెనీలతో పోటీ కాకుండా.. ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారట. చిన్న విమానాలతో, అంతగా పోటీ లేని, ఇంత వరకు పెద్దగా విమానాల సేవల అనుసంధానం లేని పట్టణాలను ఎంచుకోనున్నారట. పోటీ ఉన్న నగరాలకు కూడా సేవలు అందించినప్పటికీ.. పోటీ లేని పట్టణాల పైన ప్రత్యేక దృష్టి సారించనున్నారట.
రామ్ చరణ్ తేజ
హైదరాబాదు కేంద్రంగా హుబ్లీ, బెల్గాం, రాజ్ కోట్, సూరత్, విశాఖపట్నంల మీదుగా భువనేశ్వర్ వంటి పట్టణాలకు సేవలు అందించే అవకాశాలున్నాయట.
రామ్ చరణ్ తేజ
రామ్ చరణ్ తేజకు విమానయాన రంగం అంటే తొలి నుండి ఆసక్తి ఉందట. రామ్ చరణ్ వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ప్రజల్లో కంపెనీకి గుర్తింపు వస్తుందని ఇఫ్పటికే భావిస్తున్నారు.
రామ్ చరణ్ తేజ
టర్బో జెడ్ ఇంజిన్స్ హైదరాబాద్ కంపెనీ ద్వారా టర్బో ఏవియేషన్ విమానాల నిర్వహణ, మరమ్మతు సేవల్లోకి కూడా అడుగు పెట్టాలని భావిస్తున్నారట.