హైద్రాబాద్-తిరుపతి చెర్రీ విమానం: ప్రచారకర్తగా రామ్చరణ్ తేజ?
హైదరాబాద్: టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ కంపెనీ విమానాలు మరో ఒకటి, రెండు నెలల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. తొలుత హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రారంభించనున్నారు. టర్బో మెఘా ఎయిర్ వేస్ విమానయాన సంస్థ హైదారాబాదుకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ.
మరో పది రోజుల్లో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు వచ్చే అవకాశముందని టర్బో ఏవియేషన్ ఉన్నతాధికారి చెప్పారని సమాచారం. దీంతో ఇది నెలన్నర, రెండు నెలల వ్యవధిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.
మూడు ఏటీఆర్ 72-200 విమానాలతో హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల్లోని రెండు, మూడో దశల్లో నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తారు. విమానాలను లీజుకు తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చిందంటున్నారు. పైలట్లు, ఇతర సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయని చెబుతున్నారు.
ట్రూజెట్ బ్రాండ్తో మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఔరంగాబాద్, హుబ్లీ వంటి నగరాలకు సేవలు అందిస్తారు.
గత ఏడాది జులైలో ఆరు విమానయాన సంస్థలకు విమానయాన శాఖ నిరభ్యంతర పత్రాన్ని మంజూరు చేసింది. వీటిలో ఎయిర్ ఒన్ ఏవియేషన్, జెక్సస్ ఎయిర్, ప్రీమియర్ ఎయిర్లు జాతీయ స్థాయి విమానయాన సంస్థలు కాగా, టర్బో మేఘా ఎయిర్వేస్, ఎయిర్ కార్నివల్, జావ్ ఎయిర్వేస్లు ప్రాంతీయ సంస్థళు.
వంద నుండి రెండు వందల మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అందులో 30 మంది పైలట్లు, 20 మంది ఎయిర్ హోస్టెస్లు ఉంటారు. కాగా, విజయవాడ కేంద్రంగా ప్రాంతీయ విమాన సంస్థ ఎయిర్ కోస్టా 2013లో ప్రారంభమైంది.
ఇప్పుడు టర్బో మెఘా రెండో తెలుగు ప్రాంతీయ సంస్థ. టర్బో మెఘాకు రామ్ చరణ్ తేజ డైరెక్టర్గా ఉండటం అదనపు ఆకర్షణ అని అంటున్నారు. కంపెనీకి ప్రచారకర్తగా రామ్ చరణ్ తేజ వ్యవహరిస్తారా అనే చర్చ సాగుతోంది. దీంతో సంస్థ బ్రాండ్ ఇమేజ్ భారీగా పెరుగుతుంది.