చిరుపై పవన్ టర్న్: జూఎన్టీఆర్, చెర్రీలకి రివర్స్ కానుందా
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమికి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజలకు ఇబ్బందులు తలెత్తనున్నాయా? అనే చర్చ సాగుతోంది.
2009 సాధారణ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. రామ్ చరణ్ తేజలు ప్రజారాజ్యం పార్టీకి మద్దతు పలికారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పిఆర్పీ కోసం బాగా శ్రమించారు. ఈసారి అంతా రివర్స్ అయింది.
పార్టీలో, కుటుంబంలో విభేదాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈసారి టిడిపికి ప్రచారం చేయలేదు. తన తండ్రి చిరంజీవి కాంగ్రెసు పార్టీలో, తన బాబాయి పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపికి మద్దతిచ్చినందున రామ్ చరణ్ తేజ మౌనం దాల్చారని అంటున్నారు. అయితే చిరంజీవి క్రమంగా రాజకీయ ప్రాధాన్యత కోల్పోతున్నారని, ఇది చెర్రీకి ఏమైనా ఇబ్బందులు తెస్తుందా అనే చర్చ సాగుతోంది.
ఎన్నికల నేపథ్యంలో చివరి నిమిషం వరకు టిడిపి, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కోసం ఎదురు చూశారు. ఆయన ప్రచారం చేస్తారనే వాదన కూడా ఓ సమయంలో వినిపించింది. కుటుంబంతో తన విభేదాలను పక్కన పెట్టి ఆయన తాతయ్య స్థాపించిన పార్టీ కోసం ప్రచారం చేయవచ్చునని చాలామంది భావించారు. ఎన్టీఆర్ కూడా స్వయంగా తన చివరి క్షణం వరకు టిడిపి వైపే ఉంటానని చెప్పారు.
అయితే జూనియర్ మాత్రం ప్రచారం చేయలేదు. ఇది నందమూరి అభిమానులకు ఆందోళన కలిగించిందనే చెప్పవచ్చు. జూనియర్ ప్రచారం చేయవద్దని ఎంత పట్టుతో ఉన్నారో... అతనిని పరిగణలోకి తీసుకోవద్దని టిడిపి అగ్రనేతలు కూడా అంతే పట్టుతో కనిపించారు. ప్రచారం సమయంలో ఆయనను ఎవరు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఎవరిని ప్రచారం కోసం బొట్టు పెట్టి పిలువమని, అభిమానం ఉంటే వారే వస్తారని బంతిని జూనియర్ కోర్టులోకి వదిలారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని పలువురు జోస్యం చెబుతున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్కు ఇబ్బంది కలిగించే అంశం కాకమానదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు, బాలకృష్ణతో వచ్చిన విభేదాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సెగ తగిలిందని అంటున్నారు.
విభేదాల వల్ల గతంలో ఆయన సినిమాలు ఆడని సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా అదే పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. గత ఏడాది జూనియర్ నటించిన సినిమాను పలువురు నందమూరి అభిమానులు బైకాట్ చేశారు. జూనియర్ తదుపరి చిత్రం రభస త్వరలో విడుదల కానుంది. దాని భావితవ్యం ఏమిటనేది ఉత్కంఠగా మారింది. అయితే, సినిమాలు, రాజకీయాలు వేరని, జూనియర్ అభిమానులు జూనియర్కు ఉన్నారనే వాదనలు కూడా లేకపోలేదు.
చిరు తనయుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ తేజ మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ రుచి చూశారు. సినిమాల్లో చిరంజీవి మెగాస్టార్. రెండున్నర దశాబ్దాల పాటు ఆయన హవా నడిచింది. అయితే రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుందని అంటున్నారు. 2009లో పీఆర్పీ నేతగా చిరు ప్రచారం చేస్తే వచ్చిన జన స్పందనను 2014లో కాంగ్రెసు నేతగా చిరు ప్రచారం చేస్తే వచ్చిన జన స్పందనను పోల్చుతున్నారు.
సీమాంధ్రలో ఈ ఎన్నికల్లో చిరంజీవి ప్రచారానికి అంతగా అదరణ లభించలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు మంచి ఆదరణ లభించింది. మరోవైపు చాలామంది మెగా అభిమానులు పవన్ వెంట వెళ్లేందుకే సిద్దమయ్యారనే వాదనలు వినిపించాయి. చిరుకు ఆదరణ తగ్గడం, పవన్ మరో టర్న్ తీసుకోవడం రామ్ చరణ్ తేజ సినిమా కెరీర్ పైన ప్రభావం పడనుందా అనే చర్చ సాగుతోంది. అయితే సినిమాలు, రాజకీయాలు వేరనే వారు లేకపోలేదు. కాగా పవన్ టిడిపి, బిజెపి కూటమికి ప్రచారం చేసినందువల్లే రామ్ చరణ్ తేజ ప్రచారానికి దూరంగా ఉండవచ్చునని అంటున్నారు.