దత్తత తీసుకుంటా, థ్యాంక్స్ బాబాయి: పవన్ చెప్పిన మరుసటి రోజే చెర్రీ ప్రకటన, ఉపాసన ట్వీట్
అమరావతి: టిట్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజులు అక్కడే ఉండి సమీక్షించారు. కొబ్బరి, మామిడి, జీడి తోటలు నేలకూలి, రైతులకు భారీ నష్టం జరిగింది.
చదవండి: నిజమవుతున్న అభిమానుల ఆశలు: కలవనున్న బాలకృష్ణ-జూ.ఎన్టీఆర్
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పవన్ ఈ నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. అంతేకాదు, బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకొని ఆదుకోవాలని కోరారు.
చదవండి: గ్రామ దత్తతపై రాంచరణ్ని అడుగుతా, శ్రీకాకుళం కోసం ముందుకు రావాలి: పవన్ కళ్యాణ్
పవన్ సూచించిన వెంటనే చెర్రీ సానుకూల స్పందన
తన అన్నయ్య చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజను కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అడుగుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ ఇలా ప్రకటన చేసిన ఒక్క రోజులోనే రామ్ చరణ్ తేజ కూడా సానుకూలంగా స్పందించారు.
బాబాయ్ సూచన సంతోషం
తుపాను బాధితుల పరామర్శ నిమిత్తం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం, విజయనగరంలో పర్యటించినప్పుడు నష్టపోయిన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని తనకు సలహా ఇచ్చారని, బాబాయ్ ఈ సూచన ఇవ్వడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని రామ్ చరణ్ తేజ చెప్పారు.
ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటానో త్వరలో ప్రకటిస్తా
బాబాయ్ సలహా పాటించాలని నిర్ణయించుకున్నానని రామ్ చరణ్ అన్నారు. గ్రామం దత్తత విషయమై తన బృందంతో చర్చించానని, ఏ గ్రామం దత్తత తీసుకోవాలో తన బృందం గుర్తిస్తుందని, ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నానో త్వరలో ప్రకటిస్తా చెప్పారు.
ఉపాసన అకౌంట్ నుంచి ట్వీట్
రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్కు థ్యాంక్స్ చెప్పారు. టిట్లీ ప్రభావిత శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేలా స్ఫూర్తి కలిగించినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఉపాసన అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. రామ్ చరణ్ పేరుతో.. మీ వెంటే, స్ఫూర్తినిచ్చినందుకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు.
పలువురి విరాళం
టిట్లీ తుఫాను కారణంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు, జూ.ఎన్టీఆర్ రూ.13 లక్షలు, విజయ దేవరకొండ రూ.5 లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ రూ.5 లక్షలు, బాలకృష్ణ రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ.50వేలు ప్రకటించారు.