రోడ్లపైనే తిరుగుతుంటా: వాణీ విశ్వనాథ్కు వర్మ కౌంటర్, ‘రోజా అంటేనే పుకార్లు’
వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న‘లక్ష్మీఎన్టీఆర్'చిత్రంపై రగడ కొనసాగుతూనే ఉంది.
హైదరాబాద్/అమరావతి: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పొందిస్తున్న'లక్ష్మీఎన్టీఆర్'చిత్రంపై రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వర్మపై విమర్శలు ఎక్కుపెట్టిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అనితలకు కౌంటర్లు ఇచ్చిన వర్మ.. తాజాగా సీనియర్ సినీ నటి వాణీవిశ్వనాథ్కు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
వాణీ విశ్వనాథ్ హెచ్చరికకు వర్మ..
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీసే ప్రయత్నం విరమించుకోవాలని లేకపోతే వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరించిన నేపథ్యంలో రామ్గోపాల్ వర్మ స్పందించారు. తన ఇంటి ముందు ధర్నా చేయడానికి తనకు ఇల్లే లేదన్నారు. తాను రోడ్లపై తిరుగుతూ ఉంటానని, తనని వెతుక్కుంటూ రోడ్లపైకి వస్తే.. వాణి విశ్వనాథ్ పాదాలు కమిలిపోతాయంటూ చురకలంటించారు వర్మ.
వాణీ విశ్వనాథ్ ఏమన్నారంటే..
కాగా, అంతకుముందు వాణి విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులను ‘మీకు దేవుడులాంటి నటుడు ఎవరు' అని అడిగితే కళ్లు మూసుకుని అందరూ చెప్పే పేరు ఎన్టీఆర్. తెలుగు ప్రజల మనసులో ఆయన ఓ రాముడిగా, కృష్ణుడిగా ముద్రవేసుకున్నారు. ఆయన జీవితం గురించి బాలకృష్ణ ఓ చిత్రాన్ని తీస్తున్నారు. అది గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి కాబట్టి ఎన్టీఆర్ను దేవుడిలాగానే చూపిస్తారు. కానీ, రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'పై అనుమానాలున్నాయి' అని అన్నారు.
మామూలుగా లేవు! ఎమ్మెల్యే అనితకు వర్మ కౌంటర్స్, వ్యంగ్యాస్త్రాలు
వర్మ విరమించుకోవాలి.. లేదంటే ధర్నా..
‘రాముడి సినిమా తీస్తూ.. రావణ అని, కృష్ణుడి సినిమా తీస్తూ.. కంస అని, గాంధీ సినిమా తీస్తూ.. గాడ్సే అని పేరు పెట్టలేరు కదా. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించే ప్రయత్నాన్ని వర్మ వెంటనే విరమించుకోవాలి. ఎన్టీఆర్కు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతా. వర్మ తీసే సినిమా పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉంది. ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక్' చిత్రంలో కథానాయికగా నేను నటించా. ఓ వీరాభిమానిగా చెబుతున్నా. వర్మ సినిమా తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవడం ఉత్తమం' అని వాణీ విశ్వనాథ్ తేల్చి చెప్పారు.
రోజా అంటేనే పుకార్లు..
లక్ష్మీస్ ఎన్టీఆర్పై తన ఆసక్తిని తెలియజేశారు సినీ నటి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా. వర్మ తనను కోరితే నటించేందుకు సిద్ధమేనని చెప్పారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. రోజా అంటేనే పుకార్లు షికార్లు చేస్తుంటాయని అన్నారు.
వర్మ అడిగితే.. ఆలోచిస్తా..
రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నటిస్తున్నారన్న వార్తలపై మీడియా రోజాను ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో స్పందించారు. ‘నేను హీరోయిన్గా 150 సినిమాలు చేశాను. వర్మ తీసే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో నేను నటిస్తున్నానని ప్రజలు అనుకోవడంలో తప్పులేదు. ఇటీవల వర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం కారణంగా కూడా కొంతమందికి అనుమానం కలిగింది. అయితే, ఇంతవరకూ ఆయన నన్ను సంప్రదించలేదు. అడిగితే మహోన్నత వ్యక్తి(ఎన్టీఆర్) సినిమాలో నటించే విషయం ఆలోచిస్తా. ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు' అని రోజా స్పష్టం చేశారు.