బెజవాడలో ఉద్రిక్తత: వర్మకు చేదు, దాడి చేస్తాం.. వంగవీటి ఫ్యాన్స్
విజయవాడ: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'వంగవీటి' కోసం విజయవాడ వస్తున్నారు. వంగవీటి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకునేందుకు విజయవాడకి బహిరంగంగా వస్తున్నానని రామ్ గోపాల్ వర్మ గురువారం ట్వీట్ చేశాడు.
ఇటీవల ఆయన చేస్తున్న ట్వీట్లు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి బెజవాడకు తాను వెళుతున్నానంటూ ఆయన చేసిన కామెంట్లు విజయవాడలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించేలా కనిపిస్తున్నాయి. దివంగత వంగవీటి రంగా జీవితం ఆధారంగా 'వంగవీటి' చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వంగవీటి మోహన రంగా గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు స్వయంగా విజయవాడ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం విజయవాడకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడకు వస్తున్న రామ్ గోపాల్ వర్మ.. వంగవీటి మోహన రంగా గురించి పలు విషయాలను తెలుసుకునే ఉద్దేశ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూను కలవనున్నట్లు తెలుస్తోంది. దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్తో ఆయన ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. నెహ్రూతో భేటీకి రేపు ఉదయం ఏ సమయంలో ఇంటికి రావాలంటూ ఆయన అవినాశ్ను ఆరా తీశారట.
రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన పరిటాల రవి ఆధారంగా రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2ను తెరకెక్కించారు. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో మూడు దశాబ్దాల క్రితం కీలక నేత అయిన వంగవీటి రంగాపై సినిమా తీస్తున్నారు.
విజయవాడలో ఉద్రిక్తత
రామ్ గోపాల్ వర్మ సాయంత్రం బెజవాడ రానున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్మ విజయవాడ వస్తే దాడి చేస్తామని దేవినేని రంగా అభిమానులు గతంలోనే హెచ్చరించారు. మరోవైపు వర్మ రాక నేపథ్యంలో దేవినేని, వంగవీటి వర్గీయులు పోటాపోటీగా ర్యాలీలు తీస్తున్నారు. వర్మను రిసీవ్ చేసుకునేందుకు అభిమానులు గన్నవరం విమానాశ్రయానికి తరలి వచ్చారు.
గన్నవరం విమానాశ్రయంలో చేదు అనుభవం
గన్నవరం విమానాశ్రయంలో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. విమానాశ్రయంలో పోలీసులు అతనిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. పోలీసులతో చర్చల అనంతరం వర్మ.. విజయవాడ వెళ్లారు.