దూకుడు పెంచిన రామ్ మాధవ్: మోడీకి అవగాహన లేదని కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇంచార్జీగా నియమితులైన వెంటనే రామ్ మాధవ్ దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం అమలుపై దృష్టి పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత ఆయన బిజెపి ఎపి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటిరగానే పోటీ చేస్తుందని, ఎటువంటి పొత్తులు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు సమాధానం చెప్పాలని...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కన్నా తామే ఎక్కువ నిబద్ధతతో ఉన్నామని రామ్ మాధవ్ అన్నారు. సెంటిమెంటుకు అభివృద్ధితో సమాధానం చెబుతామని ఆయన సమావేశానంతరం మీడియాతో అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రశ్నలు వేస్తున్నారని, వాటికి సమాధానం చెబుతామని, అదే సమయంలో తాము అడిగే ప్రశ్నలకు చంద్రబాబు జవాబు చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఆ భేటీలో తప్పు లేదు
ప్రధాని నరేంద్ర మోడీని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి కలవడంలో తప్పేమీ లేదని బిజెపి ఎంపి కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రధానిని కలిసే హక్కు ఎంపీలకు ఉంటుందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. టిడిపి నేతలు అపోహపడవద్దని, టిడిపి ఎంపీలతో తమ అధిష్టానం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా...
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ప్రధాని మోడీ గౌరవిస్తారని హరిబాబు చెప్పారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. త్వరలో రైల్వే జోన్ వస్తుందని అన్నారు. లేనిపోని అపోహలతోనే తెలుగుదేశం ఎన్డీఎ నుంచి వైదొలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు
దాంట్లో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని హరిబాబు అన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని చెప్పారు. అమిత్ షా భేటీ తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. గత బడ్జెట్లో వడ్డీ రాయితీల కోసం ఇచ్చిన రూ.100 కోట్లలో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని ్న్నారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్సంచారు.
అప్పుడు మోడీకి అవగాహన లేదు...
ఎన్నికలకు ముందు మోడీకి ప్రత్యేక హోదాపై సరైన అవగాహన లేదని తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి అన్నారు. తిరుపతి సభలో ఎవరో రాసిచ్చిన చీటీ చూసి హోదా ఇస్తామని ప్రకటించారని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఎపికి తెలంగాణ కన్నా ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలిపారు. ఎ1, ఎ2లకు ప్రధాని అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారనే ప్రశ్న అర్థం లేనదని అన్నారు. జగన్ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, అప్పుడే దోషులుగా ఎలా నిర్ధారిస్తారని ఆయన చెప్పారు.