దక్షిణాది యాత్ర, ఓడ నుంచి దూకబోయి సముద్రంలో పడ్డారు, ఏపీలో మా ప్రభుత్వమే: బాబుపై రాంమాధవ్
అమరావతి: ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడం ద్వారా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తప్పు చేశారని బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నారు. మోడీని చూసే టీడీపీకి ఏపీలో ఓట్లు పడ్డాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏపీకి ఎంతో చేసిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామన్నారు. చంద్రబాబువి అన్నీ కాంగ్రెస్ బుద్ధులేనని విమర్శించారు.
అంత తెలివి తక్కువవాడిని కాదు: వెంకన్న చౌదరి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మురళీ మోహన్
చంద్రబాబు 2014లో ఇచ్చిన ప్రజాతీర్పును పక్కన పెట్టి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. కేంద్రం చేసిన వాటిని చంద్రబాబు మరిచిపోయి విమర్శలు చేస్తున్నారన్నారు.
దక్షిణాదిలో బీజేపీ యాత్ర ప్రారంభం
కర్ణాటకలో ఎన్నికలతో బీజేపీ దక్షిణాది యాత్ర ప్రారంభమైందని రామ్ మాధవ్ అన్నారు. ఇక తమ పార్టీ తర్వాత లక్ష్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు అన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఫ్రంట్లు, టెంట్లు అంటూ కొత్త పొత్తులకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీని ఒంటరిగా ఎదుర్కోలేక ఇతర పార్టీలు అవినీతి కాంగ్రెస్తో జట్టు కట్టేందుకు బెెంగళూరులో ఒకే వేదికపై కలిశాయన్నారు.
నాలుగేళ్లలో శక్తిమంతంగా మార్చాం
జాతీయస్థాయిలో రాహుల్ గాంధీతో జతకట్టిన ప్రాంతీయ పార్టీలు ఇక మునిగేందుకు సిద్ధమవుతున్నాయని రామ్ మాధవ్ అన్నారు. బీజేపీ జైత్రయాత్ర దక్షిణాదిలో ఖాయమని తేలిపోయిందన్నారు. అందుకే ఓ నేత కోల్కతాకు, మరో నేత ఢిల్లీకి వెళ్లి పార్టీల నేతలతో సమావేశమయ్యారని చంద్రబాబు, కేసీఆర్లను ఉద్దేశించి అన్నారు. మోడీ హయాంలో అవినీతికి తావులేకుండా పోయిందన్నారు. నాలుగేళ్ల పాలనలో మోడీ సర్కార్ దేశాన్ని శక్తిమంతంగా మార్చిందన్నారు.
ట్రాఫిక్ సమస్యను తీర్చనివారు నీతులు చెబుతారా?
2019లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చి 2020లో శక్తిమంతమైన దేశాన్ని నిర్మిస్తుందని రామ్ మాధవ్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 160 జిల్లాల్లో ఉన్న మావోయిజం ఇప్పుడు కేవలం 20 జిల్లాలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారతాన్ని రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆయన వైఫల్యాలతో చేసి చూపిస్తున్నారన్నారు. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేని వారు విమర్శించడం విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్పై మండిపడ్డారు. ఓవైసీ సోదరులతో కలిసి ఉన్నవారు బీజేపీని మతతత్వ పార్టీ అంటారా అని ప్రశ్నించారు. ముస్లీంలో, క్రైస్తవులు, బౌద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోను బీజేపీ అధికారంలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు ఉన్నాయన్నారు.
ఓడ నుంచి దూకబోయి సముద్రంలో పడ్డారు
బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసిన వ్యక్తి హఠాత్తుగా ఓడ నుంచి దూకే ప్రయత్నంలో సముద్రంలో పడ్డారని చంద్రబాబును ఉద్దేశించి రామ్ మాధవ్ అన్నారు.
తిరుపతిలో ఇచ్చిన హామీలను మోడీ నిలబెట్టుకోలేదని అంటున్నారని, సీమాంధ్ర స్కామాంధ్రగా మారనంతకాలం వరకు ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని, ఇప్పటికే 85 శాతం హామీలు అమలుచేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కులతత్వ రాజకీయాలతో వెంకన్నస్వామికి కులాన్ని అంటగట్టారని మురళీ మోహన్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.