వైఎస్ జగన్ ఏడాది పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాం మాధవ్.. బీజేపీ రాష్ట్ర నాయకులకు షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై నిప్పులు జరుగుతుంటే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాత్రం అందుకు భిన్నంగా జగన్ పనితీరును ప్రశంసించారు. ఏపీలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి పాలన సాగిస్తున్న జగన్, అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు సంవత్సరం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన రామ్ మాధవ్ ప్రధాని నరేంద్ర మోడీకి, సీఎం జగన్ కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు .. ఇకనైనా బుద్ధి తెచ్చుకో .. గోరంట్ల బుచ్చయ్య చౌదరి
సీఎం జగన్ ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు
అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ప్రజల కోసమే పని చేస్తున్నారని రాం మాధవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని రామ్ మాధవ్ ప్రశంసించారు. అంతేకాదు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పార్లమెంటులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లభిస్తుందని దీనిని మోడీ సర్కార్ స్వాగతిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వివాదాలు వస్తున్నప్పటికీ అవి అంత పెద్దవి కాదని వాటిపై కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాం మాధవ్ పేర్కొన్నారు. దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సంతోషకరమైన విషయమని రాం మాధవ్ పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటుగా, వాటికి మించి ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని ఇప్పటికే చెప్పారని పేర్కొన్నారు .
రాం మాధవ్ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు చాలా తేడా
ఆ దిశగానే ఏపీకి అండగా నిలిచారని రామ్ మాధవ్ పేర్కొన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు రాం మాధవ్ . కానీ ఏపీలో బీజేపీ నాయకులు మాత్రం జగన్ తీరు పట్ల,జగన్ ఏడాది పాలన పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు. కూల్చడం, దాడులకు పాల్పడటం తప్ప జగన్ సర్కారు ప్రజలకు చేసిందేమీ లేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్ ప్రజా కంటక పాలన సాగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
వైసీపీ ఏడాది పాలనపై రాష్ట్ర నాయకుల అసంతృప్తి
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరాచక పాలన కొనసాగుతుందని వారు నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిత్యం పోరాటమే చేస్తుంది. ఒక పక్క రాష్ట్ర నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉంటే, మరో పక్క కేంద్ర అగ్రనాయకుడు జగన్ పాలనకు కితాబిచ్చారు. ఇక రాం మాధవ్ జగన్ పాలన బాగుందని వ్యాఖ్యలు చేయడం బిజెపి శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు.