కియా మేడిన్ ఏపీ: గొప్ప ముందడుగు... చంద్రబాబు ప్రభుత్వానికి హీరో రామ్ ప్రశంసలు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్కు టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. రాష్ట్ర విభజన అనంతరం, కొన్నేళ్ల క్రితం అనంతపురంకు పరిశ్రమలు వస్తాయని తాము చెబితే ఎవరూ నమ్మలేదని, కానీ ఇక్కడ నీటి వసతులు కల్పించి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు పారిశ్రామిక రంగానికి అనుకూలంగా చేయడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఇప్పుడు రాయలసీమ ఇండస్ట్రియల్ హబ్గా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు.
Just a few years ago nobody would’ve believed that so many industries would come to @anantapurgoap. Due to State govt’s relentless efforts to ensure water supply in this area, we could attract major investments. Now Rayalaseema has become the industrial hub of AP. #KiaMadeInAP pic.twitter.com/O9PqSfAka2
— N Chandrababu Naidu (@ncbn) January 29, 2019
ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ట్వీట్ పైన హీరో రామ్ స్పందించారు. ఇది వాస్తవమని, మన రాష్ట్రం పురోగతిలో గొప్ప ముందడుగు అని, మరిన్ని వస్తాయని పేర్కొన్నారు. కియా మేడిన్ ఏపీ పేరుతో ట్యాగ్ చేశారు.
This is so true..a Massive step forward for our state! Many more to come! #KiaMadeInAP https://t.co/IUv9iTmhTA
— RAm POthineni (@ramsayz) January 29, 2019
కాగా, అనంతపురం జిల్లా ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ నుంచి తొలి కారు విడుదలైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దక్షిణ కొరియా, ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయన్నారు. తక్కువ సమయంలో కియా మోటార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని, 2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్ ప్రొడక్షన్ స్థాయికి చేరుకుందని, దక్షిణ కొరియా, ఏపీ ప్రజలు ఎక్కడైనా నెగ్గుకురాగలరన్నారు.
కియా పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్గా మారుతుందన్నారు. దక్షిణ కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారన్నారు. రాష్ట్రంలో హీరో మోటార్స్, అపోలో టైర్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్డ్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ వంటి విధానాలు తీసుకొచ్చామని చెప్పారు. కియా మోటార్స్కు భారత్ అతిపెద్ద మార్కెట్ అవుతుందని, ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ వల్లే ఏపీకి కియా పరిశ్రమ వచ్చిందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను కియా కోసం కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే, కియా మాత్రం ఏపీని ఎంచుకుందని చంద్రబాబు ట్వీట్ చేశారు.