రాజ్యాంగేతర శక్తి: లోకేష్పై రామచంద్రయ్య ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సి రామచంద్రయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. నారా లోకేష్ ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలో లక్ష్మీ పార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబునాయుడు.. లోకేష్ వ్యవహారంపై ఏమంటారని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఏపి రాజధాని నిర్మాణం కోసం పచ్చటి పొలాలను బలవంతంగా లాక్కోవడం సరికాదని అన్నారు. ఈ అంశంపై ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడతారా? అని ప్రశ్నించడం చంద్రబాబుకు తగదని అన్నారు.
రెండుసార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన చంద్రబాబునాయుడు, శ్రీకాకుళంలో పవర్ ప్లాంట్ కోసం పచ్చటి పొలాలు సేకరిస్తారా? అని అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం గుర్తుంచుకోవాలని రామచంద్రయ్య చురకంటించారు. చంద్రబాబు తన తీరు మార్చుకుని ఏకాభిప్రాయంతో రైతుల నుంచి భూమి సేకరించాలని సూచించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ బలవంతంగా భూములు సేకరిస్తామంటే ఎప్పటికీ రాజధాని కట్టలేరని అన్నారు.
చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారు: నాగిరెడ్డి
హరిత ప్రాజెక్టు పేరుతో రైతులను ఏపి సిఎం చంద్రబాబునాయుడు మరోసారి మోసం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు ఆత్మవంచన మాని ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.
కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంతకుముందు ధరల స్థిరీకరణ అన్న చంద్రబాబు, ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, కొత్త హామీలు ఇవ్వాలని నాగిరెడ్డి సూచించారు.