ఓటుహక్కుపై సీఆర్, ఓడిస్తారని తెలుసన్న మంత్రి
హైదరాబాద్: ముస్లీంలకు ఓటు హక్కు వద్దన్న శివసేన పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య మండిపడ్డారు. అంబేద్కర్ జీవించి ఉంటే ముస్లీంలకు ఓటు హక్కు వద్దన్న వ్యాఖ్యలు విని ఎంతో కలత చెందేవారన్నారు. ఇలాంటి విపరీత ధోరణిలను అరికట్టి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడినప్పుడే అంబేద్కర్కు నిజమైన నివాళి అన్నారు.
ఓడిస్తారు: నారాయణ
వచ్చే ఎన్నికల్లోగా రాజధానిని నిర్మించకపోతే ప్రజలు తమను ఓడిస్తారనే విషయం తెలుసునని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో ఆయన మంగళవారం పర్యటిస్తున్న సయమంలో రైతులు చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
తొలి నుంచి టీడీపీ జెండాను మోసినప్పటికీ భూములు వదులుకోవాలంటే భయంగా ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న 90 శాతం మంది పరిస్థితి ఇలానే ఉందన్నారు. దీనిపై మంత్రి స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంత రైతుల కోసం ప్రకటించిన ప్యాకేజీని శాసనసభలో చట్టం చేయడం జరిగిందన్నారు.
చట్టాన్ని మార్చాలంటే మళ్లీ శాసనసభలో చర్చించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి డిసెంబర్ 8న చేసిన ప్రకటన ఆధారంగా శాసనసభలో చట్టం చేశామన్నారు. అయితే కొంతమంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దని మంత్రి కోరారు.
రెండు గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేస్తామని నారాయణ తెలిపారు. సీఆర్డీఏ ఆగిపోతే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నించగా, సభలో చట్టం చేసిన తర్వాత మార్పులు ఉండవన్నారు. ప్రస్తుతం కొంతమంది రైతులు కోర్టుకు వెళ్తున్నారని, వారంతా సీఆర్డీఏ చట్టం పైనే వెళ్తుండవచ్చన్నారు.