Coronavirus:ఐదుగురు ప్రార్థనలు చేసేందుకు ఓకే, ఏపీలో ‘రంజాన్’సడలింపులు ఇవే..
రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. మసీదులో ప్రార్థనల సమయంలో మినహాయింపునిచ్చింది. ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించింది. రాష్ట్రంలో ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో రంజాన్ మాసం దృష్ట్యా 24 గంటల విద్యుత్ సరఫరా అందించాలని, సరిపడా మంచినీరు సరఫరా చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు.
రంజాన్ ఉపవాసల నేపథ్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేసేందుకు ఉదయం 10 గంటల వరకు షాపులకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్తార్కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులు తెరిచేందుకు అంగీకరించింది. రంజాన్ మాసం సందర్భంగా కూడా ఆహారం అందించే వారి కోసం తెల్లవారుజామున 3 నుంచి 4.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు కూడా పర్మిషన్ ఇస్తున్నట్టు జీవోలో పేర్కొన్నది.
ఆయా పట్టణం/గ్రామంలో మూడు నుంచి నాలుగు పాయింట్లలో మాత్రమే ఇఫ్తార్, సహర్ కోసం హోటల్స్ తెరిచేందుకు అనుమతిచ్చారు. వైరస్ లక్షణాలతో క్వారంటైన్లో ఉన్న ముస్లింలకు పండ్లు, డ్రై ప్రూట్ ఉదయం, సాయంత్రం ఇవ్వాలని స్పష్టంచేసింది. వారికి పౌష్టికాహారం అందజేసే విషయంలో రాజీపడబోమని తేల్చిచెప్పింది. లాక్ డౌన్ సందర్భంగా ఇమామ్, మైజింలకు పాసులు ఇస్తున్నట్టు.. అలాగే కరోనా వైరస్ నియంత్రణ గురించి తెలిపే బ్యానర్ ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నది. తాము అనుమతిచ్చిన అన్ని అంశాలకు సంబంధించి మాస్క్లు ధరించి.. సామాజిక దూరం పాటించాలని ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
Recommended Video