నరకం: చంద్రబాబుపై రామకృష్ణ, కెసిఆర్పై రమణ ఫైర్
అనంతపురం/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలకు చంద్రబాబు నాయుడు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. శనివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ అంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబు, అధికారం చేపట్టి రెండు నెలలు గడిచినా ఇంకా రుణాలు మాఫీ చేయలేదని అన్నారు.
బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇస్తున్నా.. చంద్రబాబు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకపోతే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రామకృష్ణ జోస్యం చెప్పారు.
పథకాల లబ్ధిని తగ్గిస్తే ఊరుకోం: రమణ
హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ సర్వే పేరిట పేదలకు వచ్చే పథకాల లబ్ధిని తగ్గిస్తే వూరుకోమని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ హెచ్చరించారు. విద్యారంగం-ప్రభుత్వ వైఖరిపై టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో శనివారం జరిగిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోర్టుకు ఒకటి, ప్రజలకు ఒకటి చెప్పి కెసిఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టిడిపి నేత పెద్ది రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
చెప్పేదొకటి చేసేదొకటి: కెసిఆర్పై ప్రభాకర్
తెలంగాణ ప్రభుత్వం చెప్పేదొకటి... చేసేదొకటని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆగస్టు 19న సమగ్ర సర్వే ఎందుకనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. మెట్రోపై నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం పాలనపై దృష్టిసారించాలన్నారు. కెసిఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే కోర్టులో మొట్టికాయలు పడ్డాయని వ్యాఖ్యానించారు. ప్రధాన నిర్ణయాలన్నీ వివాదాస్పదమయ్యాయన్నారు. నిర్ణయాల వెనక ఉన్నవారిని త్వరలో బయటపెడతామని ప్రభాకర్ తెలిపారు.