హోదాపై ‘నాయుడు’ ద్వయం నాటకాలాడుతోంది: రామకృష్ణ ఫైర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదాపై నాయుడు ధ్వయం(ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు) నాటకాలు ఆడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి శ్రీకాకుళం నుంచి చేపట్టిన బస్సు యాత్ర బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంది.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ఆగస్టు 10లోపు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని, లేదంటే 11న అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ చేపడతామన్నారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దీని సాధనకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఐక్య కార్యాచరణ సమితి నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పిలుపునిచ్చారు. ఈ సభలో నేతలు చలసాని శ్రీనివాస్, కారెం శివాజీ, తదితరులు పాల్గొననున్నారు.
8న తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ: రామచంద్రయ్య, శైలజానాథ్
తిరుపతి: ‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు' పేరుతో ఆగస్టు 8న తిరుపతిలో కాంగ్రెస్ పోరు సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు రామచంద్రయ్య, శైలజానాథ్ తెలిపారు. విభజన హామీలను బిజెపి నెరవేర్చడంలో విఫలమయ్యిందని వారు ఆరోపించారు.
సర్దుకుపోతామనే ధోరణితో ఏపి సిఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం కేటాయించిన రూ. 350 కోట్లను ఇతర పనులకు మళ్లించారని రామచంద్రయ్య, శైలజానాథ్ విమర్శించారు.