ఆరోపణలకు కట్టుబడి ఉన్నా...సిబిఐ విచారణ జరిపిచండి: రమణదీక్షితులు
తిరుమల:తిరుమల శ్రీవారి వంటశాల పోటులో తవ్వకాల గురించి తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని టిటిడి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మరోసారి మీడియాతో మాట్లాడారు.
తాను చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్నీ నిజాలు బయటకొస్తాయని, వాటిని నిరూపించడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని రమణ దీక్షితులు తెలిపారు. స్వామి వారి ఆలయంలో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, రహస్యంగా తవ్వకాలు జరిపిన విషయం వాస్తవమని రమణ దీక్షితులు నొక్కివక్కాణించారు.
అలాగే పింక్ డైమండ్ విషయంలో ఆలయ ఈవో అనిల్కుమార్ సింఘాల్ అసలునిజాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేశారని రమణ దీక్షితులు ఆరోపించారు. అసలు పింక్ డైమండే లేదని, అది పింక్ రూబీ మాత్రమేనని ఈవో అనిల్కుమార్ సింఘాల్ చెప్తుతున్నారని రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు టిటిడి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వ్యవహారశైలిపై కొన్ని బ్రాహ్మణ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. శ్రీవారి సేవలో నిత్యం కైంకర్యాలు చేస్తూ దైవత్వం సంతరించుకున్న రమణ దీక్షితులు ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య సలహాదారు కోట శంకర శర్మ చెప్పారు. ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో పక్క రాష్ట్రంలో కూర్చుని తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా మాట్లాడటం రమణ దీక్షితులుకు ఏమాత్రం తగదని ఆయన అన్నారు. అలాగే రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివిధ బ్రాహ్మణ సంఘాలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని కోట శంకర శర్మ హితవు పలికారు.