రమణదీక్షితులకు మరో షాకిచ్చిన టీటీడీ: ఆగమ సలహాదారుగా తొలగింపు, ఇక బంధం తెగినట్లే
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక వర్గం పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు మరో షాకిచ్చింది. ఆగమశాస్త్ర సలహాదారు పదవి నుంచి రమణదీక్షితులను తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Recommended Video
మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశంలో ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. ఇప్పటికే అర్చక పదవి నుంచి తొలగించిన టీటీడీ.. ఇప్పుడు ఆగమశాస్త్ర సలహాదారు పదవికి నుంచి కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
టీటీడీపై రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే టీటీడీపై చేసిన ఆరోపణలకు గాను నోటీసులు కూడా పంపింది. వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దంగా ఉంది. కాగా, తాజాగా తీసుకున్న టీటీడీ నిర్ణయంతో తిరుమల దేవస్థానంతో రమణదీక్షితులుకు 24ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లుగానే చెప్పవచ్చు.
టీటీడీ కీలక నిర్ణయాలు
తిరుమల శ్రీవారి విరాళాల వినియోగంలో ఆచితూచి వ్యవహరించాలని, తెలుగు రాష్ట్రాల్లో ఈ-దర్శన్ కౌంటర్లు నిర్వహించాలని పలువురు సభ్యులు సూచించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అభివృద్ధికి మొదటి విడత రూ.36 కోట్లు, తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, ప్రకాశం జిల్లా దుద్దుకూరులో చెన్నకేశవస్వామి ఆలయం పునరుద్ధరణకు రూ.25 లక్షలు కేటాయించినట్టు టీటీడీ ఈవో తెలిపారు.
తిరుమలలో రూ.70 కోట్లతో భక్తుల వసతి సముదాయం నిర్మాణానికి స్థల పరిశీలనకు నిర్ణయించినట్టు చెప్పారు. కాగా, ఆగమ సలహా మండలి సభ్యుడిగా ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులును టీటీడీ నియమించింది. అర్హులైన మిరాశి వంశస్థులైన 12 మందిని అర్చకులుగా నియమించామని, ఇందులో నలుగురు తిరుమలకు, మిగిలిన 8 మందిని గోవిందరాజుస్వామి ఆలయంలో అర్చకులుగా నియమించినట్టు తెలిపారు.