ఆరోపణలకు బలం చేకూర్చేలా: మహా సంప్రోక్షణంపై రమణదీక్షితులు సందేహాలు
చెన్నై: మహా సంప్రోక్షణంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సందేహాలు వ్యక్తం చేశారు. మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంపై స్పందిస్తూ.. మహా సంప్రోక్షణపై టీటీడీ ఛైర్మన్కు అవగాహన లేదని అన్నారు.
Recommended Video
24తర్వాతే: మహా సంప్రోక్షణంపై టీటీడీ ఈవో, సోషల్ మీడియా విమర్శలపై అసంతృప్తి
భక్తులను ఆలయానికి అనుమతించకూడదనే నిర్ణయం సరైనది కాదని, భక్తులకు భగవంతున్ని దూరం చేయాలనే ప్రయత్నమేనని తప్పుబట్టారు. గతంలో టీటీడీపై తాను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు తన ఆరోపణలకు పాలకమండలి, ప్రభుత్వం జవాబు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆలయంలో రహస్యంగా సంప్రోక్షణ పూజలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. స్వామి వారి సంపదను దోచుకోవాలనే ప్రయాత్నాన్ని అడ్డుకునేందుకే సీబీఐ విచారణ కోరుతున్నానని తెలిపారు. స్వామి వారకి అపచారం చేయకుండా సంప్రోక్షణ నిర్వహించాలని టీటీడీని ఆయన కోరారు.
'టీటీడీ బోర్డుకు ఆథ్యాత్మికవేత్తలు, సమాజసేవకులు, హిందూ సంప్రదాయాలు, దేవాలయాలు, ఆగమశాస్త్రం, వేదాలపైన నమ్మకం ఉన్న వయో వృద్ధులు సభ్యులుగా ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. కానీ, ప్రస్తుతం ఉన్న టీటీడీ బోర్డులో సభ్యులు అందరూ రాజకీయనాయకులే తప్ప, ఎటువంటి ఆథ్యాత్మిక చింతన, సంస్కారం లేని వారు, హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేనివాళ్లే ఉన్నారు. దేవాలయాన్ని పరిరక్షించడానికి వచ్చిన అధికారులు కూడా అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావారే తప్ప, సేవా భావం ఉన్నవాళ్లెవరూ లేరు. అందువల్లే, ఇటువంటి వైపరీత్యాలన్నీ జరుగుతున్నాయి’ అని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు.