రామానాయుడికి సినీరత్న ఇవ్వాలి: కృష్ణంరాజు, రామ్ చరణ్ స్పందన
హైదరాబాద్: మూవీ మొఘల్ రామానాయుడు బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతికి సిని ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మాట్లాడుతూ.. భారతరత్న, ఖేల్ రత్నలా.. సినీరత్న అనే దానిని ఏర్పాటు చేసి, తొలి అవార్డును రామానాయుడికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రామానాయుడు తనకు ఆప్తమిత్రుడు అన్నారు.
రామానాయుడు మృతికి టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. ''తెలుగు చిత్రసీమ గొప్ప నిర్మాతను కోల్పోయింది. తొలి సినిమాని నాన్నగారితో (ఎన్టీఆర్) రాముడు - భీముడు నిర్మించిన ఆయన తర్వాత శ్రీకృష్ణ తులాభారం వంటి ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు.
నేను కూడా ఆయన నిర్మాతగా చేసిన కథానాయుకుడు, రాము చిత్రాల్లో నటించా. ఎన్నో గొప్ప విలువలు ఉన్న నిర్మాత. అనేకమంది కొత్త దర్శకులను, నటీనటులను, టెక్నీషియన్స్ను పరిచయం చేయడమే కాకుండా భారతీయ భాషలన్నింటిలో చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్ సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. ఈ రోజు ఆయన మనలను విడిచిపోవడం బాధాకరం.'' అన్నారు.
రామానాయుడు సినిమానే సర్వస్వంగా భావించారని మురళీ మోహన్ అన్నారు. భారత దేశం గర్వించదగ్గ నిర్మాతల్లో రామానాయుడు ఒకరని విలక్షన నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. ఆయన నుండి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
రామానాయుడు నిర్మాతలకు రోల్ మోడల్ అని రామ్ చరణ్ తేజ అన్నారు. భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. రామానాయుడు మృతదేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. సినిమా పరిశ్రమకు రామానాయుడు పర్యాయపదం అని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు.