స్వాముల లడాయి: చాగంటిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమణానంద మహర్షిపై కేసు
అమరావతి: గత వారం రోజులుగా టీవీలు, ఆధ్యాత్మిక సభల్లో చెలరేగుతోన్న స్వాముల లడాయి తాజాగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావుపై సద్గురు రమణానంద మహర్షి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అతని శిష్యుడు పిఎస్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల ఐదో తేదీ రాత్రి 9 గంటల సమయంలో శివశక్తిసాయి ఛానల్లో సద్గురు రమణానందమహర్షి ఆధ్యాత్మిక ప్రసంగం ఇచ్చారు.
సాయిబాబా గుళ్లలో హిందూ దేవుళ్లెందుకు?: గోవిందానంద స్వామి
ఈ కార్యక్రమంలో ఆయన చాగంటి కోటేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చాగంటి దిష్టిబొమ్మకు చెప్పులతో కొట్టి అవమానించారు. దీంతో అక్కయ్యపాలెంకు చెందిన చాగంటి శిష్యుడు, సత్సంగం ప్రతినిధి నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శివశక్తిసాయి ఛానల్లో ప్రసారమవుతోన్న వార్తలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చాగంటి సత్సంగ్ సభ్యులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. దీనిలో ఏ1గా జ్యోతిర్మయి భవానీ, ఏ2గా రమణానంద మహర్షిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రమణానంద మహర్షిపై వచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని, న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుని అవసరమైతే ఆయన్ను అరెస్టు చేస్తామని సిఐ బాలకృష్ణ విలేఖర్లకు తెలిపారు. కాగా, రమణానంద మహర్షికి విశాఖపట్నంలోని బాలయ్య శాస్ర్తీ లే అవుట్లో షిర్డీసాయి ఆశ్రమం ఉంది.