తుని విధ్వంసం: 'జగన్ పాత్ర పరిశీలించాలి, చిరంజీవిపై దాడి చేయించారు'
విజయవాడ: తుని విధ్వంసం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు అని, ఈ కుట్రలో జగన్ పాత్రను కూడా పరిశీలించాలని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ బుధవారం డిమాండ్ చేశారు.
సీఐడీ విచారణలో తనపై ఆరోపణలకు భూమన సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం విడ్డూరమన్నారు. చంద్రబాబుకు గానీ, ఆయన తాత తండ్రులకుగానీ నేర చరిత్ర లేదన్నారు. నేరచరిత్ర ఉన్నది జగన్ కుటుంబానికే అన్నారు.
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ఎంపీ చిరంజీవి, ఎమ్మెల్సీ చెంగల్రాయుడిపై గతంలో భూమన కరుణాకర్ రెడ్డి దాడి చేయించారని ఆరోపించారు. కాపుల పైన దాడులు చేసిన భూమన.. మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంకు ఎలా ఆత్మీయుడయ్యాడన్నారు.
తుని సభ జరిగిన కొబ్బరి తోటను పరిశీలించాల్సిన అవసరం భూమనకు ఎందుకు వచ్చిందన్నారు. తుని విధ్వంసం వల్లే కాపు జాతికి చెడ్డ పేరు వచ్చిందని, దీనికి భూమన బాధ్యుడు కాదని రుజువు చేసుకోవాలన్నారు. పల్స్ సర్వేకు వ్యతిరేకంగా గడపగడపకు తిరిగి దుష్ప్రచారం చేసిన వైసిపి.. కాపులకు అండగా ఉంటామనే మాట వింతగా ఉందన్నారు.
కడప జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్నీ జగన్ బలిజలకు కేటాయించలేదన్నారు. కాగా, వైసిపి ప్రోత్సాహంతో బీసీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా కాపులు సంయమనం కోల్పోవద్దని రామానుజయ సూచించారు. తిరుపతిలో జస్టిస్ మంజునాథ కమిషన్ అభిప్రాయ సేకరణ సందర్భంగా కాపులు, బీసీల మధ్య గొడవ జరిగిన దృష్ట్యా ఆయన కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
బీసీలు, కాపుల మధ్య గొడవ సృష్టించాలనే ఆలోచనతో ఉన్న అరాచక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. బీసీలకు ఏ విధంగానూ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు.
అవసరమైతే అదనంగా ఒకటి, రెండు శాతం రిజర్వేషన్లు పెంచి బీసీలకు ఉన్న ఫలాలు తగ్గకుండా కాపులకు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లాగా రిజర్వేషన్లు కల్పించే యోచనలో ఉన్నారన్నారు. గతంలో కాపులు బీసీల్లోనే ఉన్నారని, కానీ కొంతమంది స్వార్థపరుల కుట్రలు కారణంగా రిజర్వేషన్లు కోల్పోయాలన్నారు.