ఆది ఎఫెక్ట్, అసంతృప్తి: చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ
అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఆ తర్వాత నారా లోకేష్, కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ మంత్రి, కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి శనివారంనాడు భేటీ అయ్యారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగించడానికే ఈ భేటీ జరిగినట్లు చెబుతున్నారు..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి విజయం సాధించిన ఆదినారాయణరెడ్డిని టిడిపిలో చేర్చుకున్నప్పటి నుంచి రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. రామసుబ్బారెడ్డి వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు ఆయనను పార్టీలో చేర్చుున్నారు.
పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. దాంతో అలక వహించిన రామసుబ్బారెడ్డి పార్టీకి కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన మహానాడుకు కూడా ఆయన హాజరు కాలేదు.
తిరుగుబాటుకు సిద్ధపడ్డారా....
రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటుకు సిద్ధపడ్డారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతోనే ఆయనను చంద్రబాబు పలిపించి మాట్లానట్లు తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేయడం సాధ్యం కాదని రామసుబ్బారెడ్డి మొదట్లోనే చెప్పారు. అనుకున్నట్లే, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి.
లోకేష్, కళా వెంకట్రావు చర్చలు...
రామసుబ్బారెడ్డితో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కిమిడి కళా వెంకట్రావు కూడా శనివారం చర్చలు జరపారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత వారిద్దరు రామసుబ్బారెడ్డితో చర్చలు జరిపారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రామసుబ్బారెడ్డికి చంద్రబాబు స్పష్టం చెప్పినట్లు తెలుస్తోంది.
శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారం తర్వాత....
నంద్యాల పార్టీ టికెట్ కోసం పట్టుబట్టి విఫలమైన శిల్పా మోహన్ రెడ్డి చివరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలోకి వచ్చి మంత్రి పదవి కూడా పొందిన అఖిల ప్రియతో ఆయన తీవ్రంగా విభేదిస్తూ టిడిపిని వీడారు. అలాంటి పరిస్థితే జమ్మలమడుగులోనూ రావచ్చుననే ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు రామసుబ్బారెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
జగన్ను దెబ్బ కొట్టాలని చూస్తే....
రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. వైసిపి నుంచి గెలిచిన 20 మంది శాసనసభ్యులను పార్టీలో చేర్చుకున్నారు. అయితే, పలు చోట్ల అది ఎదురు దెబ్బ తిరుగుతోంది. జమ్మలమడుగులోనూ అటువంటి పరిస్థితే ఏర్పడింది.