తిరగబడిన చంద్రబాబు ప్లాన్: రామసుబ్బారెడ్డి తిరుగుబాటు
కర్నూలు జిల్లా రాజకీయం కడపలో పునరావృతమవుతోంది.చంద్రబాబుపై రామసుబ్బా రెడ్డి తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడబోనంటూ రామసుబ్బారెడ్డి మొండికేసినట్లు తెలుస్తోంది.
కడప: కర్నూలు జిల్లా రాజకీయం కడపలో పునరావృతమవుతోంది. భూమా అఖిల ప్రియను పార్టీలోకి తీసుకుని ఆమెకు మంత్రి పదవి ఇవ్వడంతో తిరుగుబాటు ప్రకటించి శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు. కడప జిల్లా జమ్మలమడుగులోనూ అదే పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది.
జమ్మలమడుగు తాజా రాజకీయం చూస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను టిడిపిలోకి తీసుకుని వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ను దెబ్బ కొట్టాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యూహం బెడిసి కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబుపై రామసుబ్బా రెడ్డి తిరుగుబాటు ప్రకటించారు.
Recommended Video
పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడబోనంటూ రామసుబ్బారెడ్డి మొండికేసినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి ఎంతగా చెప్పినప్పటికీ వినకుండా చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
పదవి కూడా వద్దంటూ....
మూడున్నర దశాబ్దాల నుంచి రామసుబ్బారెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి విధేయతతో ఉంది. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పటికీ రామసుబ్బారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. పదవి కూడా వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి మరీ వెళ్లిపోయారు. పదవి తీసుకోవాలని కోరినప్పటికీ అలక వహించి వెళ్లిపోయారు.
ఫాక్షన్కు పెట్టింది పేరు..
రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంది. అక్కడ 1983 నుంచి, అంటే ఎన్టీ రామారావు హయాం నుంచీ తెలుగుదేశం పార్టీలో శివారెడ్డి వర్గం ఉంటూ వస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో శివారెడ్డి హత్యకు గురయ్యారు. ఆయనకు కుమారుడి వరుసైన రామసుబ్బారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశంపార్టీ నుంచి ఎమ్మెల్యే విజయం సాధించి మంత్రి పదవి కూడా చేపట్టారు.
ఆదినారాయణ రెడ్డి ఇలా...
ఆదినారాయణ రెడ్డ 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలిచారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని, అలా చేర్చుకుంటే పనిచేసే వాతావరణం ఉండదని రామసుబ్బారెడ్డి వర్గం మొదటి నుంచి కూడా చంద్రబాబుకు చెబుతూ వస్తోంది. అయినా వినకుండా చంద్రబాబు ఆయనను చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు.
కలిసిపోవాలని ఎంత చెప్పినా..
ఇరు వర్గాలు కలిసిపోవాలని, కలిసి పనిచేయాలని, ఎవరి ప్రాధాన్యతలు వారికి ఉంటాయని చంద్రబాబు ఎంతగా నచ్చజెప్పినా సయోధ్య కుదరలేదు. ఆదినారాయణ రెడ్డి మంత్రి కాకముందు జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి కమిటీలకు తెలుగుదేశంపార్టీ నేతల పేర్లను రామసుబ్బారెడ్డి ప్రభుత్వానికి సమర్పించారు.అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కమిటీలను ఇటీవల ఖరారు చేశారు. అనూహ్యంగా రామసుబ్బారెడ్డి ప్రతిపాదించిన పేర్లు కాకుండా ఆదినారాయణ రెడ్డి సిఫారసు చేసిన పేర్లు ఖరారయ్యాయి. దీంతో రామసుబ్బారెడ్డి వర్గం కంగు తింది.
చివరకు అది కూడా...
చివరకు జమ్మలమడుగులో వైన్ షాపు ఏర్పాటు చేసే విషయంలో రామసుబ్బారెడ్డి వర్గీయులకు అక్కడ మునిసిపల్ కమిషనర్ ఎన్ఓసి ఇవ్వకపోవటంతో అగ్గి మరింత రాజుకుంది. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిణామాలతో రామసుబ్బారెడ్డి వర్గం తెలుగుదేశం పార్టీ మహానాడుకు దూరంగా ఉంది. అదే రోజు రామసుబ్బారెడ్డి తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు రామసుబ్బారెడ్డికి తనను కలవాల్సిందిగా కబురు పెట్టారు. దాంతో రామసుబ్బారెడ్డి చంద్రబాబును ఇటీవల కలిశారు.
గంట సేపు చంద్రబాబుతో...
గంట సేపు జరిగిన భేటీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని రామసుబ్బారెడ్డి చంద్రబాబుకు వివరించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు ఏడాదిన్నర క్రితం రామసుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ అమలు కాలేదు. అది అమలు కాకపోగా ప్రత్యర్థి అయిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబుతో భేటీ తర్వాత రెండు గంటల పాటు టిడిపి ఎపి అధ్యక్షుడు, మంంత్రి కళా వెంకట్రావ్ రామసుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. హమీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కళా వెంకట్రావు రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దానికి రామసుబ్బారెడ్డి అంగీకరించలేదు. రామసుబ్బారరెడ్డి కౌన్సిల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, అది తన చేతుల్లో లేదని కళా వెంకట్రావు చెప్పారు.
మరోసారి చంద్రబాబుతో...
అదే రోజు సాయంత్రం మరోసారి రామసుబ్బారెడ్డి చంద్రబాబును కలిశారు. తన అసంతృప్తిని చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు. న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే, దానికి రామసుబ్బారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకేమీ పదవి అక్కరలేదంటూ రామసుబ్బారెడ్డి విజయవాడ నుంచి బయలుదేరి జమ్మలమడుగు చేరుకున్నారు.
చంద్రబాబు పిలిస్తే తప్ప...
చంద్రబాబు పిలిస్తే తప్ప పార్టీ కార్యాలయం వైపు కూడా చూడనంటూ రామసుబ్బారెడ్డి అదే రోజు పార్టీ నాయకులకు చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కన్నా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతనే తమ అనుచరులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామసుబ్బారెడ్డి చంద్రబాబు వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాన్ని పరిశీలిస్తే రామసుబ్బారెడ్డి వేరే వెతుక్కుంటారా అనే చర్చ కూడా సాగుతోంది.