పంతం: ఆదినారాయణరెడ్డికి రామసుబ్బారెడ్డి చెక్, మంత్రిగా అవమానమే..!
కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు సద్దుమణగడం లేదు. ఓ పదవి కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి, టిడిపి సీనియర్ నేత రామసుబ్బా రెడ్డిల మధ్య వివాదం నడుస్తోంది.
కడప: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు సద్దుమణగడం లేదు. ఓ పదవి కోసం మంత్రి ఆదినారాయణ రెడ్డి, టిడిపి సీనియర్ నేత రామసుబ్బా రెడ్డిల మధ్య వివాదం నడుస్తోంది. ఇరువురూ పదవి విషయంలో పంతంతో ముందుకు వెళ్తున్నారు.
భూమా ఎఫెక్ట్: బెట్టింగుతో అతను కోటీశ్వరుడయ్యాడు!!
వీరి వైఖరి టిడిపి అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోందని చెబుతున్నారు. ఆదినారాయణ, రామసుబ్బా రెడ్డిల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి రాజకీయ వైరం ఉంది. ఆది టిడిపిలో చేరినప్పటి నుంచి రామసుబ్బా రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
చంద్రబాబు ఆదేశించినా
వీరిద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ మాటల్లేవు. పార్టీ విషయంలో కలుపుకొని వెళ్లే పరిస్థితులు లేవని అంటున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఇరువురు కలిసి పని చేయాలని సూచించినా వారు మాత్రం ఒకరిపై మరొకరు పై చేయి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ పదవి కోసం పంతం
పదవుల విషయంలో చంద్రబాబు ఇద్దరికీ అసంతృప్తి లేకుండా చేశారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, రామసుబ్బా రెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య మాత్రం సయోధ్య కుదరడం లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి పాలకవర్గ ఛైర్మన్ పదవి ఇద్దరి మధ్య మరింత చిచ్చు పెట్టిందంటున్నారు.
ఆది ప్రయత్నాలకు రామసుబ్బారెడ్డి చెక్
తన కుమారుడు సుధీర్ రెడ్డిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి పాలకవర్గ ఛైర్మన్ను చేయాలని ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రయత్నాలను రామసుబ్బా రెడ్డి అడ్డుకున్నారు. పనులు, పదవులు అన్నీ ఆది వర్గానికే అయితే ఎలాగని రామసుబ్బా రెడ్డి నిలదీశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు.
అవమానంగా భావిస్తున్న ఆదినారాయణ రెడ్డి
రామసుబ్బారెడ్డి నిలదీతతో టిడిపి అధిష్టానం ప్రస్తుతానికి ఆ పదవిని సుధీర్కు ఇచ్చే అంశాన్ని నిలిపేసిందని అంటున్నారు. మంత్రి హోదాలో తన కొడుక్కి ఒక్క పదవి ఇప్పించుకోలేకుంటే ఎలాగని భావిస్తున్న ఆదినారాయణ.. దీనిని అవమానంగా భావిస్తున్నారని తెలుస్తోంది.
అందుకే ఆది ప్రతిజ్ఞ
ఈ అసంతృప్తితో కారణంగా మీడియా సమావేశంలో ఆదినారాయణ రెడ్డి శపథం చేశారని అంటున్నారు. ఈ నెలాఖరులోపు తన కుమారుడుకి ప్రభుత్వ ఆసుపత్రి పాలకవర్గ కమిటీ ఛైర్మన్ పదవిని ఇప్పించుకు తీరతానని, అలా కాని పక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు.
రామసుబ్బా రెడ్డి వర్గం విమర్శలు
మంత్రి హోదాలో ఉంటూ శపథాలు చేయడమేమిటని రామసుబ్బా రెడ్డి వర్గం విమర్శలు చేస్తోంది. ఆ పదవి తమ వర్గానికే దక్కుతుంది తప్ప మరొకరికి చేతుల్లోకి వెళ్లదని చెబుతోంది. అయితే ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారోనని స్థానిక నేతలు ఎదరు చూస్తున్నారు.