"ఆకాశంలో ఆ చంద్రుడు.. ఆడపడుచుల జీవితాల్లో ఈ చంద్రుడు"
పార్టీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆడపడుచులకు జరుగుతున్న మేలు గురించి వివరిస్తూ.. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మ సీఎం చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల లబ్డి గురించి రామసుబ్బమ్మ అనే ఓ మహిళ సీఎం చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆడపడుచులకు జరుగుతున్న మేలు గురించి వివరిస్తూ.. తన ప్రసంగం ఆసాంతం చంద్రబాబుపై పొగడ్తలు కురిపించారామె.
చంద్రన్న పసుపు కుంకుమ:
అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడపడుచులను ఉద్దేశించి ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని సూచించారు. సాధారణ ఫోన్ ద్వారా కూడా నగదు లావాదేవీలు చేపట్టవచ్చునని, దానిపై త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు.
కార్యక్రమంలో చంద్రబాబు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఆకాశంలో ఆ చంద్రడు.. ఆడపడుచుల జీవితాల్లో..
పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభంలో.. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మ ప్రసంగించారు. సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ప్రశంసలు కురిపించిన ఆమె.. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆడపచుల్లో జీవితాల్లో వెలుగుగా అభివర్ణించారు. ఆకాశంలో ఆ చంద్రుడు వెలుగునిస్తుంటే.. రాష్ట్ర ఆడపడుచులకు ఈ చంద్రుడు వెలుగును పంచుతున్నాడని చంద్రబాబు పనితీరును ప్రశంసించారు.
ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు..:
ఎన్టీరామారావు హయాంలో ఆడపిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్న ఆయన.. ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చారని, ఇప్పుడదే స్పూర్తితో చంద్రబాబునాయుడు లింగనిర్ధారణ చట్టం తీసుకొచ్చారని రామసుబ్బమ్మ వివరించారు. లింగనిర్ధారణ చట్టం వల్ల.. చంద్రబాబు ఆడపిల్లల ఆయుష్షును నిలబెట్టగలిగారని కీర్తించారు.
ఆడబిడ్డల కోసం శ్రమించే చంద్రన్న :
ఆడబిడ్డల కోసం నిరంతరం శ్రమించే చంద్రన్నకు మహిళల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని రామసుబ్బమ్మ తెలిపారు. రైతు రుణమాఫీ ద్వారా తమ కుటుంబానికి రూ.1.50 లక్షల లబ్ధి జరిగిందని, తద్వారా అప్పులు తీర్చుకోగలిగామని చెప్పారు. ఆ సొమ్ముతోనే తాకట్టులో ఉన్న బంగారాన్ని సైతం విడిపించుకున్నామని, ఈ రోజు నా మెడలో బంగారం ఉందంటే.. అది చంద్రబాబు కృషి వల్లేనని తెలియజేశారు.
చంద్రబాబు ఇచ్చిన సైకిల్ తోనే కాలేజీ చదువు:
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించారని, పాస్ ఉపయోగించుకునే తాను స్కూల్ కు వెళ్లానని రామసుబ్బమ్మ తెలిపారు. కాలేజీలో చేరాక.. విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చారని, ఆ సైకిల్ పైనే కాలేజీకి వెళ్లి చదువు పూర్తి చేశానని వివరించారు.
అభినందించి.. ఫోటో దిగిన చంద్రబాబు:
రామసుబ్బమ్మ ప్రసంగం అనంతరం.. ఆమెను ప్రత్యేకంగా దగ్గరగా పిలుపించుకుని అభినందించారు చంద్రబాబు. అనంతరం ఆమెతో కలిసి ఫోటో దిగారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రామసుబ్బమ్మతో చంద్రబాబు పేర్కొన్నారు.