సీఎం రమేష్పై రామసుబ్బారెడ్డి అనుచరుల దాడి: కుర్చీలు విసిరేసి నినాదాలు..
సీఎం రమేష్ గో బ్యాక్ అంటూ రామసుబ్బారెడ్డి అనుచరులు నినాదాలు చేయడంతో ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది.
కడప: జిల్లా రాజకీయాల్లో రామసుబ్బారెడ్డికి, ఆది నారాయణ రెడ్డికి చాలా కాలంగా వైరం కొనసాగుతోంది. ఆది నారాయణ టీడీపీలోకి రావడంతో.. ఇద్దరు నేతలు ఒకే గూటిలో ఉన్నా అంతర్గతంగా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి లభించడం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు.
ఇదే నేపథ్యంలో కడప జిల్లా జమ్మల మడుగులో ఈ రోజు నిర్వహించిన టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్పై రామసుబ్బా రెడ్డి అనుచరులు కుర్చీలు విసరడంతో సభలో గందరగోళం నెలకొంది.సీఎం రమేష్ గో బ్యాక్ అంటూ రామసుబ్బారెడ్డి అనుచరులు నినాదాలు చేయడంతో ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది.
సీఎం రమేష్ పై రామసుబ్బారెడ్డి అనుచరుల దాడితో రంగంలోకి దిగిన పోలీసులు వారిని కట్టడి చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.