జగన్కు ఎన్డీఏ పిలుపు: ‘‘సీఎం’ అయ్యేందుకు మద్దతు, చంద్రబాబు తొందరపడ్డారు’
హైదరాబాద్: ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటికి వచ్చిన నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలగడం తొందరపాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.
Recommended Video
చంద్రబాబు తొందరపడ్డారు
ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుగా వ్యవహరించారన్నారు. అంతేగాక, చంద్రబాబు ఎన్డీఏలోనే కొనసాగి ఉంటే హోదాపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించేవారని అన్నారు.
జగన్ ఎన్డీఏలోకి వస్తే.. సీఎం..
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోడీ, అమిత్షాలతో తాను మాట్లాడతానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని రక్షించుకోండి..
ఈ సందర్భంగా రాహుల్పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజ్యాంగాన్ని తామూ, మోడీ రక్షిస్తామని.. కాంగ్రెస్ పార్టీని ఆయన రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధ కట్టం కొంతమేర దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవమే అయినా..ఇప్పటికీ పలు చోట్ల దళితులు వేధింపులను ఎదుర్కొంటున్నట్టు అభిప్రాయపడ్డారు.
మీడియా సహకారం లేదు
ఇది ఇలా ఉండగా, ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ నేత పురందేశ్వరి మండిపడ్డారు. తమకు మీడియా కూడా సహకరించడం లేదని... అందువల్ల తామే క్షేత్రస్థాయికి వెళ్లి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని మేధావులకు, ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
ఆ సాకుతో నిధులు కావాలంటూ..
ఎయిమ్స్ నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారని, అయితే త్వరలోనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తికానుందని అన్నారు. జనవరి నుంచి ఎయిమ్స్ లో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని పురంధేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెరగకపోయినా... ముంపు ప్రాంతం పెరిగిందనే సాకు చూపుతూ, నష్ట పరిహారం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడుగుతోందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు.