చిరంజీవి ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయలేదే: బాబు, జగన్కు బీజేపీ పిలుపుపై..
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ను కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఎన్డీయోలోకి ఆహ్వానించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బీజేపీ కుట్ర తేటతెల్లమైందన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన లక్ష్యం తెలుగుదేశం పార్టీనే అని మండిపడ్డారు.
చదవండి: జగన్కు ఎన్డీఏ పిలుపు: ''సీఎం' అయ్యేందుకు మద్దతు, చంద్రబాబు తొందరపడ్డారు'
శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక హాల్లో నిర్వహించిన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్రంలో జగన్ వంటి అవినీతిపరులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. టీడీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారని, వైసీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్లకు అధికారం కావాలన్నారు.
చదవండి: వాళ్లకి పవన్ మాస్టర్ స్ట్రోక్!: ఛానల్ కొన్న తోట ఎవరు? ఇక చిరంజీవి - నిమ్మగడ్డ కూడా??
అందుకే జగన్ను పట్టుకున్నారు
జగన్ను తమ కూటమిలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్డీయే నాయకులు ఆహ్వానిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వారి కుట్ర రాజకీయాలకు అదే నిదర్శనమన్నారు. నీటిలో కొట్టుకుపోతున్నవారికి ఏదో గడ్డిపరక ఆసరా కావాలని, బీజేపీకి ఏపీలో ఏమాత్రం బలం లేదని, అందుకే జగన్ను పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఇక్కడేమీ లేదని, కేసుల నుంచి బయట పడటానికి వాళ్లు ఎవర్నో ఒకర్ని పట్టుకోవాలని, అందుకే బీజేపీతో కలుస్తున్నారని విమర్శించారు. జగన్ ఎన్డీయేలోకి రావాలని, ప్రధాని, అమిత్ షాతో తాను మాట్లాడుతానని, మోడీ కోహ్లీలా మంచి కెప్టెన్ అని, ఒక బ్యాట్సుమెన్ వెళ్లిపోయారని, జగన్ వస్తే ఆయనే ఏపీ సీఎం అని అథవాలే వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు స్పందించారు.
Recommended Video
అదేం బాగాలేదు
దుగరాజపట్నం పోర్టుకి బదులుగా వాడరేవు వద్ద నౌకాశ్రయం ఏర్పాటు చేస్తారని ఏపీ బీజేపీ నేతలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగరాజపట్నం పోర్టు చట్టంలో ఉందని, విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గించడానికి వాడరేవు వద్ద నౌకాశ్రయం ప్రతిపాదన చేస్తున్నారని, వాన్పిక్ భూములపై ఉన్న కేసు పరిష్కారమైతే ప్రత్యేకంగా ఎస్పీవీ పెట్టి దాన్ని చేపట్టవచ్చనని, ప్రయివేటు భాగస్వామ్యంలో పోర్టు నిర్మాణానికి ఎవరైనా వస్తారని చెప్పారు. వైయస్ హయాంలో వాన్పిక్, లేపాక్షి ప్రాజెక్టులు కేసుల్లో చిక్కుకోవడానికి వాళ్లే కారణమన్నారు. శుక్రవారం బీజేప నేతలు అధికారిక కార్యక్రమంలో మాట్లాడిన తీరు బాగా లేదన్నారు.
మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు
విభజనచట్టంపై కేంద్రం సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్పై మొదట కౌంటర్ అఫిడవిట్ వేస్తామని, ఆ తర్వాత కేసు వేస్తామని చంద్రబాబు చెప్పారు. అది ఎలా ఉండాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని, అసెంబ్లీ నిర్వహణపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదన్నారు. మంత్రి వర్గ విస్తరణ గురించి మాట్లాడుతూ.. మైనార్టీలకు చోటు కల్పించాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు.
చిరంజీవి అలా చేసినప్పుడు పీఆర్పీలోనే పవన్ కళ్యాణ్
నిత్యం టీడీపీని విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారని, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారని, కేంద్రమంత్రి అయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. కాంగ్రెస్లోనే ఉన్నారని భావిస్తున్నారనని, ప్రజారాజ్యంను కాంగ్రెస్లో విలీనం చేసిన సమయంలో పవన్ ఆ పార్టీలోనే ఉన్నారని చెప్పారు.
చిరంజీవి ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయలేదేం?
చిరంజీవి పార్టీని విలీనం చేస్తున్న సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా పవన్ ప్రకటించలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఆయనేమీ మాట్లడలేదన్నారు. ఇటీవల జాయింట్ ఫైండింగ్ ఫ్యాక్ట్ కమిటీ వేసి కేంద్రం రూ.70 వేల కోట్లు ఇవ్వాలన్నారని, ఇప్పుడు ఆ విషయం మాట్లాడకుండా, నన్ను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లూ నన్ను తిడుతున్నారని, వాళ్లే సరిగ్గా చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్నారన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ... విభజన సమయంలో ఆయన పార్టీ పెట్టారని, ప్రజలు ఆదరించకపోవడంతో నాలుగేళ్లు వేచిచూసి ఇప్పుడు విబేధించిన పార్టీలో చేరారన్నారు.