నిమ్మగడ్డ చుట్టూ చక్రబంధం: కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారిణి: రాత్రికి రాత్రి జీవో
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన ముందరి కాళ్లకు బంధం వేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికోసం రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం రమేష్కుమార్ను కమిషనర్గా పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉపసంహరించుకున్న కొన్ని గంటల వ్యవధిలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Recommended Video
వాణీమోహన్కు కార్యదర్శి బాధ్యతలు..
సీనియర్ ఐఎఎస్ అధికారిణి జీ వాణి మోహన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాణీమోహన్ సహకార శాఖ కమిషనర్గా, పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైెరెక్టర్గా పని చేస్తున్నారు. 1996 బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన ఐఎఎస్ అధికారిణి ఆమె. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీ మోహన్ సోమవారం బాధ్యతలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రమేష్కుమార్ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా..
నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందనడానికి రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడమే నిదర్శనమని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడంతో ఈ విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఎన్నికల వాయిదా వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకుందనే అనుమానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకొంది.
సుప్రీంకోర్టుకు వెళ్లడానికి రెండు నెలలు
సాధారణంగా.. హైకోర్టు నుంచి వెలువడిన తీర్పులపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి రెండు నెలల గడువు ఉంటుంది. ఈ రెండు నెలల సమయంలో ఎప్పుడైనా అప్పీల్కు వెళ్లడానికి వీలు ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించుకుంది. అలాంటి సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కమిషనర్గా నియమిస్తూ ఎన్నికల కార్యాలయం జారీ చేసిన ఆదేశాలు చెల్లవని అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా- ఆ ఆదేశాలను ఎన్నిల కమిషన్ కార్యాలయం ఉపసంహరించుకుంది.
చక్రబంధంలో బిగించే ప్రయత్నం..
రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకునేలా చేయడం, ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తుండటం.. అదే సమయంలో సీనియర్ ఐఎఎస్ అధికారిణిని కార్యదర్శిగా నియమించడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. రమేష్ కుమార్ చుట్టూ చక్రబంధం పన్నేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయ్యాయి.
కోర్టును ఆశ్రయించే అవకాశాలు..
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఉన్న సాంకేతిక పరమైన లోపాలను ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రమేష్ కుమార్ను తక్షణమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలను స్వీకరించేలా హైకోర్టు తీర్పు ఇవ్వలేదనేది ప్రభుత్వ వాదన. ఇదే విషయాన్ని సుబ్రహ్మణ్య శ్రీరామ్ స్పష్టం చేశారు. అప్పటికప్పుడు బాధ్యతలను స్వీకరించాల్సిందిగా హైకోర్టు రమేష్కుమార్ను ఆదేశించలేదని, అయినప్పటికీ ఆయన ఎలా తనను తాను కమిషనర్గా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి రెండు నెలల గడువు ఉందని, అప్పటిదాకా రమేష్కుమార్ ఆ బాధ్యతలను స్వీకరించలేరని అన్నారు. దీనిపై హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.