‘లింగమనేని ఎస్టేట్స్ దివాళా’: ఎల్ఈపీఎల్ అధినేత రమేష్ క్లారిటీ ఇచ్చేశారు
హైదరాబాద్: లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎల్ఈపీఎల్) కంపెనీ దివాలా తీసినట్లు వస్తున్న వార్తలపై ఎల్ఈపీఎల్ కంపెనీ అధినేత లింగమనేని రమేష్ స్పష్టతనిచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాళా తీసినట్లు ప్రకటించాలని తాము కోరలేదని వివరించారు.
ఏపీలో బిగ్ బ్రేకింగ్: దివాలా దిశగా లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్
సదరు సంస్థే..
జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలోని కొన్ని సమస్యలొచ్చాయన్నారు. వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) లో దివాళా పిటిషన్ దాఖలు చేసిందని రమేష్ స్పష్టం చేశారు.
ఆ వార్తల్లో నిజం లేదు..
జర్మనీ సంస్థ పిటిషన్ ఆధారంగానే కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. తమ ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
ఆ పరిస్థితి ఎప్పుడూ లేదు..
ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, గతంలో కూడా తమ రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదని లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. లింగమనేని ఎస్టేట్స్ దివాళా తీసినట్లు నవంబర్ 14న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తా కథనాలు వచ్చాయి. తీసుకున్న రుణాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో.. రుణాలు ఇచ్చిన కంపెనీలకు నవంబర్ 29 వరకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చినట్లు ఆ కథనాలు వెల్లడించాయి.
అమరావతిలోనే ఎక్కువ ప్రాజెక్టులు..
మార్చి 1996లో లింగమనేని ఎస్టేట్స్ ప్రారంభం కాగా, ఈ సంస్థ రిజిస్టర్ ఆఫీస్ విజయవాడలో ఉండగా.. కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాదులోని బంజారా హిల్స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో లింగమనేని రమేష్ పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఇవి విజయవాడ, అమరావతిలోనే ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్ కోస్తా పేరుతో విమానాల ప్రాజెక్టును ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.