ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ టైంలో... వర్మ "వెన్నుపోటు"
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలు అని చెప్పడం కన్నా సినిమా రాజకీయాలు అని చెబితే బాగుంటుంది. అది కూడా ఒకప్పుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచనలుమూలలకు చాటిన వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ఆ మహోన్నత వ్యక్తిత్వం చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే ఈ రాజకీయాలను నడుపుతున్నది రాజకీయనాయకులు కాదు ఇద్దరు సినిమా దర్శకులు.
ఎన్టీఆర్ బయోపిక్పై రెండు వేర్వేరు సినిమాలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కిరి నోట నానుతున్న సినిమా పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నటసౌర్వ భౌమ ఎన్టీఆర్ బయోపిక్ను ఇద్దరు ప్రముఖ దర్శకులు వారివారి స్టైల్లో చూపిస్తున్నారు. ఒకరు క్రిష్ కాగా మరొకరు సంచలనాలకు పేరుగాంచిన రాంగోపాల్ వర్మ. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడైతే... రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం జరుగుతుంది. ఇందులో క్రిష్ ఎన్టీఆర్ను ఒక కోణంలో చూపిస్తున్నారు. మరి రాంగోపాల్ వర్మ తీస్తున్న చిత్రం మరో యాంగిల్లో ఉంది.
ఆర్జీవీ "వెన్నుపోటు"లో ప్రతి ఫ్రేమ్లో చంద్రబాబు ఫోటోలు
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఆడియో విడుదలకు రెండు గంటల ముందు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన సినిమాలోని పాటను యూట్యూబ్లో విడుదల చేశాడు. వెన్నుపోటు అనే సాంగ్ను విడుదల చేసి మరో తెలుగు రాష్ట్రాల్లో మరో చర్చకు తెరలేపారు. రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాడు ఎన్టీఆర్ను కొందరు ఎలాగైతే మోసం చేసి తనని పదవీచ్యుతుడిని చేశారో చెప్పారు. ఎన్టీఆర్ ఎందుకు అలా మిగిలిపోయాడో చెప్పే ప్రయత్నం చేశారు. వీడియో సాంగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి ఫ్రేమ్లో చంద్రబాబు ఫోటోలను చూపిస్తూ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని చూసే ప్రేక్షకుడిని కన్విన్స్ చేసే ప్రయత్నం రాంగోపాల్ వర్మ చేశారు. శుక్రవారం సరిగ్గా నాలుగు గంటలకు వెన్నుపోటు వీడియో విడుదల చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ ప్రమోట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ అభిమానులు ఈ సాంగ్ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూశారు. రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన కొన్ని నిమిషాలకే కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన వీడియోను చూసి కొందరు ఎన్టీఆర్ అభిమానులు వేదన చెందారు. నాటి చేదు జ్ఞాపకాలను రాంగోపాల్ వర్మ మరోసారి కళ్లముందు ఉంచారని ఆనాటి ఘటనను గుర్తు చేసుకుని బాధపడ్డారు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్కు ఆ గతి పట్టిందని ఈ వీడియోను చూసిన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం రాంగోపాల్ వర్మ ధైర్యానికి సలాం అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.
క్రిష్ ఎన్టీఆర్లో వైశ్రాయ్ ఎపిసోడ్ ఉంటుందా...?
ఇక ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో దర్శకుడు క్రిష్ వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ను లేకుండా సినిమా కంప్లీట్ చేస్తున్నారనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ అది చూపించాల్సి వస్తే చంద్రబాబు పాత్రను హైలైట్ చేయాల్సి ఉంటుంది. అందుకే దాన్ని టచ్ చేయకుండా క్రిష్ జాగ్రత్త పడ్డట్లు సమాచారం. ఇక రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్పైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అదే మనకు స్పష్టంగా ఆయన విడుదల చేసిన వెన్నుపోటు సాంగ్లో కనిపిస్తుంది. అంతకుముందే రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా పలుమార్లు సవాల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ప్రతి తెలుగువాడికి గుర్తుండిపోయే వైశ్రాయ్ ఘటన ఎవరైనా చూపించగలరా అంటూ ఛాలెంజ్ చేశారు. ఆ సంఘటన లక్ష్మీస్ ఎన్టీఆర్లో తను చూపించబోతున్నానని ప్రకటించాడు.
మొత్తానికి ఇటు క్రిష్ ఎన్టీఆర్ కథానాయకుడు, అటు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్ అయ్యాయి. ఎవరైనా ఇద్దరు సినిమా గురించి చర్చించుకుంటున్నారంటే అది వీరిద్దరి సినిమాల గురించే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అయితే ఈ ఇద్దరు డైరెక్టర్లు ఒకే వ్యక్తి కేంద్రంగా రెండు వేర్వేరు సినిమాలు తీస్తున్నారు. మరి ప్రజలు ఎవరికి జై కొడుతారో కాలమే సమాధానం చెప్పాలి.