టీడీపీకి షాకిచ్చిన ఆర్జీవీ: రేపు ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందంటూ ప్రకటన
హైదరాబాద్: అనుకున్నట్లుగానే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచే టీడీపీ గుర్రుగా ఉంది. ఇక చిత్రం పూర్తయి విడుదలకు సిద్ధం అవుతుండగా మళ్లీ టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. టీడీపీకి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్మ వాటికి కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్లాడు. ఇక ఏపీలో ఎన్నికలు వేడిక్కిన నేపథ్యంలో ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతుందని వర్మ ప్రకటించడంతో టీడీపీ నేతలు మళ్లీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం విడుదలను రాష్ట్రంలో నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా రాంగోపాల్ వర్మ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెలంగాణతో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని ఒక్క ఏపీలో మాత్రమే రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమా విడుదలకు మరోసారి టీడీపీ అడ్డంకులు సృష్టించిందని ధ్వజమెత్తిన వర్మ.... ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులు సవాలు చేయనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు తాను ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు చెబుతానంటూ ట్విటర్ ద్వారా వర్మ తెలిపారు.
ANNOUNCEMENT #Lakshmis NTR releasing tmrw on 29th as scheduled all over world and Telangana state except only AP ..We rushing to Supreme Court to appeal against AP court order ..Am calling for press meet tmrw mrng 11 AM at Prasad Lab to talk about all the developments 💪 pic.twitter.com/XxycRakxxP
— Ram Gopal Varma (@RGVzoomin) March 28, 2019
గత కొద్దిరోజులుగా వర్మ టీడీపీ టార్గెట్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేశారు. ఇందులో అసలు కథ ఉందంటూ తనే వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఎలా చనిపోయారు.. ఎవరు మానసికంగా వేధించి ఆయన్ను ఆ స్థితికి చేరుకున్నారు... తన చివరిరోజుల్లో ఎన్టీఆర్ ఎవరిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు...? కుటుంబ సభ్యుల పాత్ర ఎంత..? చంద్రబాబు ఎలా ఎన్టీఆర్ను పదవి నుంచి దించేశారు... అందుకు సహకరించినవారెవరు అనే అంశాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీశారు రాంగోపాల్ వర్మ. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రం వివాదాల చుట్టే తిరుగుతోంది. అయితే ఇవేమీ పట్టించుకోని రాంగోపాల్ వర్మ చిత్రాన్ని కంప్లీట్ చేసి మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.