2500 ఎకరాలు చాలవా: ఆస్పత్రి కోసం భూమి కావాలట, కంపెనీల నుంచి రాంకీ రూ.2.5 కోట్లు వసూల్..
విశాఖపట్టణం జిల్లా పరవాడలో గల రాంకీ ఫార్మాసిటీ 2500 ఎకరాల్లో ఉంది. 15 సంవత్సరాల క్రితం ఏపీఐఐసీ 2500 ఎకరాల భూమిలో ఫార్మాసిటీ ఏర్పాటుచేసి.. డెవలపర్ బాధ్యతలను రాంకీకి అప్పగించింది. ఇందులో 80 కంపెనీలు మందులను తయారు చేస్తుండగా.. 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే తరచూ ప్రమాదాలు జరగడంతో ఇక్కడ ఆస్పత్రి నిర్మించాలని రాంకీ భావించింది. ఇంకేముంది కంపెనీల నుంచి నగదు జమ చేసింది, తమకు మరింత భూమి కావాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. 2500 ఎకరాల భూమి కాక.. మళ్లీ భూమి కావాలని కోరడం చర్చకు దారితీసింది.
30 ప్రమాదాలు 43 మంది మృతి..
పదేళ్లలో 30కి పైగా ప్రమాదాలు జరగడంతో 43 మంది చనిపోయారు. వంద మంది వరకు గాయపడటంతో ఆస్పత్రుల్లో చేరారు. ఇది సెజ్ కాబట్టి పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులు ఆ ప్రాంగణంలోనే ఉండాలి. కానీ అలా లేదు. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ మధురవాడలో 10 ఎకరాల విస్తీర్ణంలో 670 ఫ్లాట్ల నిర్మాణానికి హరిత ప్రాజెక్ట్ చేపట్టింది. పదెకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్కు క్లినిక్ ఉండగా... 2,500 ఎకరాల్లో గల రాంకీ ఫార్మాసిటీలో 20 బెడ్ల ఆస్పత్రి ఉండాలి. కానీ ఇక్కడ క్లినిక్ కూడా లేదు.
30 కి.మీ దూరంలో గల సిటీకి
ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన ప్రతిసారీ 30 కిలోమీటర్ల దూరంలో గల నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీంతో ప్రాణనష్టం జరుగుతోంది. వరుస ప్రమాదాలు జరగడంతో ఆస్పత్రి నిర్మాణం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పరిశ్రమల్లో భద్రతపై జిల్లా మంత్రి, అధికారులు శనివారం విశాఖలో సమావేశమయ్యారు. ఫార్మాసిటీలో ఆస్పత్రి అవసరమని రాంకీ ప్రతిపాదన వచ్చింది. ప్రభుత్వం భూమి కేటాయిస్తే, ఆస్పత్రి నిర్మించేందుకు సిద్ధమని స్పష్టంచేసింది. అందుకోసం పరిశ్రమల నుంచి రూ.2.5 కోట్లు వసూలు చేశామని రాంకీ ప్రతినిధులు వెల్లడించారు.
Recommended Video
వన్ వే..
ప్రమాదం జరిగిన సమయంలో అగ్నిమాపక వాహనాలు వస్తే... అవి వెనక్కి తిరిగి వెళ్లేందుకు సరైన మార్గాలు కూడా లేవు. 80 పరిశ్రమలు ఉండి, తరచూ ప్రమాదాలు జరుగుతుంటే కేవలం ఒక్క ఫైరింజన్తోనే కాలం వెల్లదీస్తున్నారు. ఫార్మాసిటీ అవసరాలకు మరో రెండు ఫైరింజన్లు అవసరమని అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి మంటలు చెలరేగినప్పుడు నీటి కంటే కొన్ని రకాల రసాయన ఫోమ్లు వెదజల్లి వాటిని అదుపు చేయాలి... అవి అవసరమని తెలిసినా ఫార్మాసిటీలో అందుబాటులో ఉంచడం లేదంటే ఎంత అజాగ్రత్త అర్థమవుతోంది.