అమిత్ షా! ఆధారాలివిగో, మా ఐక్యత దెబ్బతిస్తారా?: పవన్ను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు
అమరావతి/న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సోమవారం నిప్పులు చెరిగారు. తెలుగు వారి ఐక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్కు 2+2 భద్రత, ఇక సమయం చూసి 'ఆమరణ'పై అడుగు
అవిశ్వాసంపై తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందన్నారు. టీడీపీపై విమర్శలు చేస్తున్న వారి వెనుక బీజేపీ హస్తం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. బీజేపీకి ధైర్యం ఉంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాలన్నారు.
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు అవహేళన చేసేలా
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు అవహేళన చేసేలా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా కేంద్రం చర్చకు మొగ్గు చూపడం లేదన్నారు. అవిశ్వాసం విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
ఐక్యత దెబ్బతీసే కుట్ర
వైయస్సార్ కాంగ్రెస్, జనసేన వంటి వాటితో తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయించి బీజేపీ తెలుగు వారి ఐక్యతను దెబ్బతీసేలా కుట్ర చేస్తోందని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై విమర్శలు చేస్తున్న వారి వెనుక కమలనాథుల హస్తం ఉందన్నారు.
విశాఖ రైల్వే జోన్పై నాటకాలు
విశాఖపట్నంకు రైల్వే జోన్ విషయంలో కేంద్రం నాటకాలు ఆడుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజకీయ కారణాలతో దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. మిత్రధర్మం అంటే ఏమిటో బీజేపీకి తెలియదన్నారు. టీడీపీ ఒక్కటే మిత్రధర్మం పాటించిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఐక్యత లేకపోవడం దురదృష్టకరమని రామ్మోహన్ నాయుడు వాపోయారు.
చంద్రబాబును అపఖ్యాతి చేసేలా, ఇదిగోండి ఆధారాలు
అమిత్ షా రాసిన లేఖలో అన్ని అసత్యాలే ఉన్నాయని రామ్మోహన్ నాయుడు తన ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబును అపఖ్యాతిపాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల డిమాండ్లను అపహాస్యం చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. అమిత్ షా లేఖలోని అంశాలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేశారు. ఏడు జిల్లాలకు రూ. 1050కోట్ల నిధులు వస్తే అందులో రూ. 946.47 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఆ మొత్తానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు (యూసీ) సమర్పించామని రామ్మోహన్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన ట్వీట్ చేశారు.
అవి చెబుతూ రామ్మోహన్ నాయుడు ట్వీట్
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులను ఎలా ఖర్చు చేశామన్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. 2014-15 నుంచి, 2016-17 వరకు మూడేళ్లపాటు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు కేంద్రం ఇచ్చింది. అలా ఇచ్చిన మొత్తం ఒక్కో జిల్లాకు రూ. 150 కోట్ల చొప్పున రూ. 1050 కోట్లు. అయితే గత ఏడాది డిసెంబర్ 14 నాటికి రూ. 893.16 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు రూ. 53.31కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా ప్రభుత్వం అభివృద్ధికి వెచ్చించిన ఖర్చు రూ 946.47కోట్లు. జనవరి 25వ తేదీకి మిగిలిన నిధులు రూ. 103.53 కోట్లు. అప్పటి వరకు ఖర్చు చేసిన రూ 946.47 కోట్లకు యూసీలను కేంద్రానికి పంపించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.