హోదా, జోన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ రామ్మోహన్నాయుడు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ నేత కింజారపు రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం సోమవారం రాత్రి నుంచి దీక్ష చేపట్టిన రామ్మోహన్నాయుడు.. మంగళవారం ఉదయం విరమించారు.
శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం-2లో రైల్వే జోన్ సాధన దీక్ష పేరుతో నిరసన తెలిపారు. కాగా, ఎంపీ దీక్షకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జడ్పీ ఛైర్మన్ చౌదరి ధనలక్ష్మి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవితోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.
ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగువారిని అవమానించిన ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉండలేవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షించివద్దని హెచ్చరించారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హోదా సాధన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని అన్నారు. శ్రీకాకుళం పోరాటాల పురిటిడ్డ, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.