దేశంపై ప్రేమ ఉంటే మోడీ అలా ఫోటోలు దిగేవారు కాదు: ఊగిపోయిన రామ్మోహన్నాయుడు
విజయనగరం: రాష్ట్ర విభజనతో ఏపీ బాగా నష్టపోయిందని, తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే, తమకు రావాల్సిన వాటి కోసం పోరాటం చేస్తే పగ సాధిస్తారా అని కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం నిప్పులు చెరిగారు. ఏపీకి జరిగిన అన్యాయం దేశమంతా తెలియాలనే మోడీ ప్రభుత్వంపై నాడు అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు.
అలా ఆయనను ఎదిరించే ప్రయత్నం చేశామని అన్నారు. తాము హక్కుల కోసం పోరాడితే బీజేపీ పగ పెంచుకుందని ఆరోపించారు. సీబీఐని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేశారని ఆయనపై సోదాలు చేశారన్నారు.
తెలంగాణ విడిపోవడానికి కోనసీమ ఓ కారణం, అంబానికి భయపడను, ఈ బతుకెందుకు: పవన్ కళ్యాణ్
ఆధారాలతో రమ్మంటే ఒక్కరూ రాలేదు
తెలుగుదేశం పార్టీపై బురద జల్లాలనే సీబీఐ, ఈడీ సోదాలు అని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. మీడియా ముందుకు వచ్చి ఆధారాలతో సహా నిరూపించాలని తాము సవాల్ విసిరితే ఏ బీజేపీ లీడర్, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడలేదని చెప్పారు. తమను వ్యతిరేకించే నేతలపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.
దేశంపై ప్రేమ ఉంటే అన్ని ఫోటోలు దిగేవారు కాదు
గుజరాత్లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రూ.3వేల కోట్లు ఇచ్చారని, కానీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మాత్రం రూ.1500 కోట్లు ఇచ్చారని రామ్మోహన్ నాయుడు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పైన, దేశం పైన మోడీకి ప్రేమ ఉంటే ఆయన ఒక్కరో ఆ రోజు అన్ని ఫోటోలు దిగేవారు కాదని చెప్పారు. పటేల్ విగ్రహావిష్కరణ రోజు మోడీ దిగిన ఫోటోలను ఉద్దేశించి అన్నారు.
మోడీ సోకులు, ఫోటోల కోసం రూ.3వేలు ఖర్చు
దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి వారితో కలిసి ఫోటోలు దిగేవారని రామ్మోహన్ నాయుడు అన్నారు. అప్పుడే ఐక్యతను చాటినట్లుగా ఉండేదని అన్నారు. సోకులు, ఫోటోల కోసం రూ.3వేల ఖర్చు చేశారని ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల కోసం ఇవ్వాల్సిన నిధులను కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. టిట్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పెను నష్టం సంభవిస్తే ఎవరూ రాలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యవేక్షించారని చెప్పారు.
జగన్ కుట్ర అక్కడే బయటపడింది
శ్రీకాకుళం వచ్చి ప్రజలను ఆదుకోవాలని వైసీపీ అధినేత వైయస్ జగన్ను కోరితే రాలేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. దీంతోనే ఆయన రాజకీయ కుట్ర బయటపడిందని చెప్పారు. చంద్రబాబును గద్దె దించాలని జగన్, నరేంద్ర మోడీలు కుట్ర చేస్తున్నారన్నారు. హోదా అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు హైదరాబాద్ తాతలాంటి రాజధాని కడుతున్నారని చెప్పారు.