టిడిపిXబీజేపీపై రామ్మోహన్ ఆసక్తికరం, కేంద్రమంత్రులు రావొచ్చు కానీ..
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా విషయమై బీజేపీ, టీడీపీ నేతల వాగ్యుద్ధం పైన తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు సోమవారం నాడు స్పందించారు. మాటల యుద్ధం టీడీపీ - బీజేపీ మధ్య కాదని, వ్యక్తుల మధ్య అని తేల్చి చెప్పారు. రెండు పార్టీల నాయకులు కూడా సంయమనం పాటించాలన్నారు.
కేంద్రమంత్రులు రాష్ట్రానికి రావడంలో తప్పులేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రులు వాస్తవాలే చెప్పాలన్నారు. మిగతా రాష్ట్రాల డిమాండ్లతో ఏపీని పోల్చడం సరికాదన్నారు. ఏపీని కేంద్రం ప్రత్యేక దృష్టితో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సీఆర్డీఏ కార్యాలయానికి తాళం
ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి నిరసనలు చోటు చేసుకున్నాయి. గతంలో రాజధాని నిర్మాణం పేరు చెప్పి తమకు ఇష్టం లేకున్నా ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందంటూ కొంతమంది రైతులు నిరసనలకు దిగారు. తాజాగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కూడా నిరసన బాట పట్టారు.
తమ నుంచి సేకరించిన భూములకు కౌలు చెల్లించాల్సిన ప్రభుత్వం, ఇప్పటిదాకా చెక్కులే అందించలేదని కొందరు రైతులు మంగళగిరిలో ఆందోళనకు దిగారు. మంగళగిరిలోని సీఆర్డీఏ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అంతేకాదు, కార్యాలయానికి తాళం వేశారు. తక్షణమే తమకు రావాల్సిన కౌలు మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.