అమిత్ షాతో రామ్మోహన్నాయుడు ప్రత్యేక భేటీ: ఏం జరిగింది?
న్యూఢిల్లీ: రాజకీయ ప్రాధాన్యత లేకపోయినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు గురువారం ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్మోహన్నాయుడుతోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు షాతో జరిగిన భేటీలో పాల్గొనడం గమనార్హం.
కాగా, రాష్ట్ర విభజన హామీలపై సుమారు గంటన్నరపాటు వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన హామీలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి డెడ్లైన్ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కీలక చర్చ
ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జరిగిన అన్యాయంపై అమిత్ షాతో రామ్మోహన్నాయుడు చర్చించినట్లు సమాచారం.
భేటీకి ప్రాధాన్యం
మలివిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. విశాఖలో రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తాము శాంతించేది లేదని టీడీపీ స్పష్టంచేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధాన అంశాలపై చర్చ
కాగా, ఏపీకి సంబంధించిన వ్యవహరాల్లో కీలకంగా ఉండే ఓ వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో షా, రామ్మోహన్ భేటీ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ప్రధానంగా రెవెన్యూ లోటు, రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెరిగిపోతున్న నేపథ్యంలో రామ్ మాధవ్ ఈ విషయంపై ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుకు వివరాలు..
కాగా, అమిత్ షాతో భేటీకి సంబంధించిన అంశాలను ఎంపీ రామ్మోహన్నాయుడు.. చంద్రబాబుకు వివరించే అవకాశం ఉంది. మరోవైపు, ఆర్థికశాఖలో జరుగుతున్న వ్యవహారం కూడా అరుణ్జైట్లీ ద్వారా తెలుసుకొని అమిత్షా వీరికి వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 5లోపు కేంద్రం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.