పవన్ హెచ్చరిక: గుర్తించాలని.. రామ్మోహన్ కౌంటర్, మంత్రులది అదే మాట!
ఉద్ధానం కిడ్నీ సమస్య పైన ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మంత్రులు, ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
శ్రీకాకుళం: ఉద్ధానం కిడ్నీ సమస్య పైన ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మంత్రులు, ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో పవన్ సూచనలను సానుకూలంగా తీసుకుంటామని చెప్పారు. గతంలో పవన్ వివిధ సమస్యలపై ప్రశ్నించినప్పుడు కూడా సానుకూలంగా తీసుకుంటామన్నారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రులు కామినేని శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడులు పవన్ హెచ్చరికల పైన స్పందించారు. ఉద్ధాన సమస్య పైన స్పందించకుంటే ప్రజాఉద్యమంగా మారుస్తామని పవన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు.
స్వాగతిస్తున్నామన్న రామ్మోహన్ నాయుడు
ఉద్దానం సమస్యల పైన పవన్ కళ్యాణ్ స్పందనను స్వాగితిస్తున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అలాగే, పవన్ డయాలసిస్ ఆవశ్యకతను గుర్తించాలన్నారు. ఏ ప్రజాప్రతినిధి కూడా జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకెళ్లలేదన్న పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఉద్దానం కిడ్నీ సమస్య పైన తాను పార్లమెంటులో చర్చించానని గుర్తు చేశారు.
నిధుల కొరత లేదన్న అచ్చెన్నాయుడు
ఉద్దానం బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కిడ్నీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత గురించి పవన్ పేర్కొనడంపై పైవిధంగా స్పందించారు. బాధితులకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
సమస్య మూలాల కోసం పరిశోధనలు
సమస్య మూలాలు తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. అంతర్జాతీయంగా పరిశోదనలు చేసినా ఎలాంటి సమాధానం దొరకలేదన్నారు. బాధితులను మాత్రం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. తాను ఇప్పటి వరకు నాలుగు పర్యాయాలు పర్యటించానని చెప్పారు.
సిలికాన్ ఎక్కువగా ఉందని తేలింది కానీ.. కామినేని
పవన్ కళ్యాణ్ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కామినేని శ్రీనివాస రావు చెప్పారు. పవన్ సూచనలు మంచివే అన్నారు. ఆయన చెప్పిన వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. నీటిలో సిలికాన్ ఎక్కువాగ ఉండటంతో వ్యాధి వస్తున్నట్లుగా తేలిందన్నారు. కానీ మూల కారణం ఎవరూ చెప్పలేదన్నారు. అన్ని గ్రామాల్లో శుద్ధి చేసిన నీటి వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, టెక్కలిలలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం లేదని చెప్పారు.
చక్కదిద్దుతున్నామన్న పత్తిపాటి
ఏపీని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్గా చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. పవన్ సూచనలను పాజిటివ్గా తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, వాటిని తాము చక్కదిద్దుతున్నామని చెప్పారు.