పవన్! అదేమిటో చెప్పు: రామ్మోహన్ నాయుడు, లాబీయింగ్ కొత్త కథ: లోకేష్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బుధవారం విమర్శలు గుప్పించారు. రైల్వే జోన్ కోరుతూ టీడీపీ ఎంపీలు విశాఖపట్నంలో ఒక్కరోజు దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. రైల్వే జోన్ ఉద్యమం మొత్తం రాష్ట్ర ప్రజలది అన్నారు.
వాల్తేరు డివిజన్ ఉత్తరాంధ్ర ప్రజల కష్టంతో లాభాల్లో ఉందన్నారు. రైల్వే జోన్పై కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దనోట్లు రద్దు చేసినప్పుడు కమిటీలు వేసి ఏం నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఓ శాంపిల్ మాత్రమే అన్నారు.
పవన్ ఆ ఒప్పందం ఏమిటో చెప్పు
విభజన హామీలు నెరవేర్చమంటే కేంద్రం కుంటి సాకులు చెబుతోందని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. విభజన హామీలపై నిధులు వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారని, రాష్ట్రానికి రూ.74 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలని తేల్చిన ఆ కమిటీ సినిమా ఏమైందని ప్రశ్నించారు. ప్రశ్నించడానికి పవన్కు కేంద్రం కనిపించడం లేదా అన్నారు. ఢిల్లీలో జరిగిన లోపాయికారి ఒప్పందం ఏమిటో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ సిగ్గుపడాలని లోకేష్
ఏపీ ప్రయోజనాల అంశంలో సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో ఏపీకి ఏమీ ఇచ్చేది ఏమీ లేదని పేర్కొన్నారని, ఇది ద్రోహం, వంచన అన్నారు. కాంగ్రెస్ ఏపీ ప్రజల నడ్డి విరిస్తే, బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీకి మర్చిపోలేని గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీ సిగ్గుపడాలన్నారు.
లాబీయింగ్ అంటూ మరో కొత్త కట్టుకథ
నారా లోకేష్ మరో ట్వీట్లో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహ రావుపై మండిపడ్డారు. అబద్దాలు చెప్పి నిజమని నమ్మించే రకం జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లాబీయింగ్ అంటూ మరో కట్టుకథ మొదలుపెట్టారని, అసత్యాలు ప్రచారం చేయడం బీజేపీ నాయకులకు జబ్బుగా మారిందన్నారు.
Recommended Video
చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖ
ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా సీఎంకు అయిదు ప్రశ్నలను సంధించారు. టీడీపీ వెబ్సైట్ నుంచి 2014 ఎన్నికల ప్రణాళికను ఎందుకు తొలగించారు? సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు చేసిన తొలి వాగ్దానాలు అమలు చేశామని చెప్పగలరా? జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయాన్ని అంగీకరిస్తారా? విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు ద్వారా ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇక నుంచి ప్రతి వారం చంద్రబాబుకు అయిదు ప్రశ్నలు సంధిస్తానని, వాటికి సమాధానాలు చెప్పాలన్నారు.