రామోజీతో జగన్ భేటీ: ఎపి రాజకీయాలు మలుపు తిరుగుతాయా?
హైదరాబాద్: ఈనాడు అధినేత రామోజీ రావుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమైన విషయమే. ఇద్దరు బద్ద శత్రువులు చేతులు కలపడం వెనక మతలబు ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మర్యాదపూర్వకంగానే జగన్ రామోజీని కలుసుకున్నారని చెబుతున్నప్పటికీ అంతకన్నా లోతైన విషయం ఉందని భావిస్తున్నారు. నిజానికి, అలా కలిసే మనస్తత్వం జగన్ది కాదు. కానీ ఆయన అందుకు సిద్ధపడ్డారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరుగుతాయనే ప్రచారం సాగుతోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపి నెయ్యానికి గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గానీ ప్రధాని నరేంద్ర మోడీని గానీ ఆయన తప్పు పట్టుకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎత్తిచూపుతూ కేసుల నుంచి బయటపడడానికి జగన్ కేంద్రం పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని వారంటూ వచ్చారు. ఆ పరిణామానికే రామోజీ, జగన్ భేటీ దారి తీస్తుందా అనే చర్చ సాగుతోంది.
రామోజీ రావు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. రామోజీ రావు సలహా మేరకే టిడిపి ముందుకు సాగుతుందనే అబిప్రాయం కూడా ఉంది. అయితే, మారుతున్న పరిస్థితుల్లో ఎపి రాజకీయ సమీకరణాలు మారుతాయా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. రామోజీ రావు బిజెపికి కూడా అత్యంత సన్నిహితుడు. రామోజీ రావుకు బిజెపి అగ్రనేత అద్వానీతో మొదలు పెడితే ముఖ్యమైన నేతలందరితో సాన్నిహిత్యం ఉంది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడి గురించి చెప్పనే అవసరం లేదు.
ఆ దృష్ట్యా జగన్ రామోజీ రావును కలవడానికి ప్రాధాన్యత చేకూరిందని అంటున్నారు. జగన్ దూకుడుగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తే, అనుమతి నిరాకరించినా కూడా ముందుకు దూకితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాట అటుంచితే, ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఓ వైపు బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ దీక్ష వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామా, ఇవ్వమా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం జగన్ దీక్ష చేపడితే తేల్చాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే రామోజీ రావు జగన్తో మాట్లాడారా అనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. ఏమైనా, శనివారం, అంటే ఈ నెల 26వ తేదీన జగన్ తన దీక్ష విషయంలో అనుసరించే వైఖరిపై రామోజీతో భేటీకి సంబంధించిన విషయాలను అస్పష్టంగానైనా అర్థం చేసుకోవడానికి వీలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.