తెలుగు పత్రికా రంగాన్ని శాసిస్తున్న రామోజీరావు: సరి రారెవరు..
హైదరాబాద్: పత్రికా రంగంలో రామోజీ రావుకు దీటుగా నిలబడేవారు లేకుండా పోయారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ సాక్షి దినపత్రికను స్థాపించి సవాల్ విసిరారు. ఇప్పటికీ సాక్షి మీడియా మాత్రమే ఏదో మేరకు రామోజీ రావు ఈనాడుకు ధీటుగా నిలబడుతుంది. ఈనాడు దినపత్రికను చిన్నగా ప్రారంభించి, క్రమంగా విస్తరించారు రామోజీ రావు.
రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి రామోజీ రావు ఎదిగారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఎన్టీ రామారావు అధికారంలోకి రావడంలో రామోజీ రావు ఈనాడు దినపత్రికనే ప్రధాన భూమిక పోషించిందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఈనాడును ఆయన కాలానుగుణంగా మార్పుకుంటూ మరొకరు సాటి రారు అన్నట్లుగా తీర్చి దిద్దారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ పత్రికా రచనారంగంలో దానికి సాటి వచ్చే పత్రిక లేదని అందరూ అంగీకరిస్తారు.
రామోజీరావుకు పద్మవిభూషణ్, సానియా, సైనాలకు పద్మభూషణ్ అవార్డులు, బాబు హర్షం
పత్రికారంగంలో చేసిన సేవకు గాను ఆయన కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈటీవీని కూడా ఆయన బహుముఖంగా విస్తరించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ను, ప్రియా ఫుడ్స్ను, కళాంజలిని స్థాపించారు. పత్రికా రంగంతో ప్రారంభమైన ఆయన వ్యాపారం క్రమంగా వివిధ రంగాలకు విస్తరించింది.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో 1936 నవంబర్ 16వ తేదీన జన్మించిన రామోజీ రావు తొలుత కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసేవారు. క్రమంగా ఆయన వ్యాపారానికే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. హైదరాబాదు శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక నగరం ఓం సిటీని నిర్మించడానికి పూనుకుంటున్నారు.
ఈనాడు గ్రూపు కింద ఈనాడు దినపత్రిక, టీవీలతో పాటు ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలీ షోరూమ్స్ ఉన్నాయి. వసుంధర పబ్లికేషన్స్ తరఫున రామోజీ రావు సితార (సినిమా పత్రిక), చతుర (నవలా ప్రచురణకు సంబంధించిన మాస పత్రిక), విపుల (కథలకు సంబంధించిన మాస పత్రిక, వివిధ భాషలకు సంబంధించిన కథలకు తెలుగు అనువాదాలు అందిస్తుంది), అన్నదాత (రైతు పత్రిక), తెలుగు వెలుగు వంటివాటిని ప్రచురిస్తున్నారు.
Also Read: రజనీకాంత్కు పద్మ విభూషణ్, రాజమౌళికి పద్మశ్రీ
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కింద శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, మూడు ముక్కలాట, చిత్రం, వంటి పలు చిత్రాలను నిర్మించారు. బహుముఖంగా ఆయన వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి.
ఈనాడు దినపత్రికకు దీటుగా దాసరి నారాయణ రావు ఉదయం దినపత్రికను, గిరీష్ సంఘీ వార్త పత్రికను ప్రారంభించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉదయం దినపత్రిక యాజమాన్యం చేతులు మారి చివరకు మూతపడింది. వార్త దినపత్రిక క్రమంగా పోటీలోనే లేకుండా పోయింది.