టిడిపికి నటి రమ్యశ్రీ జై, జత కలవనున్న నారా రోహిత్
హైదరాబాద్: ప్రముఖ నటి రమ్యశ్రీ శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానమని చెప్పారు. తాను ఇక నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
బాబుతో దత్తాత్రేయ భేటీ
చంద్రబాబుతో బిజెపి సికింద్రాబాద్ లోకసభ అభ్యర్థి బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. హైదరాబాదులో బాబు నివాసంలో భేటీ అయిన వీరిరువురూ ఎన్నికల ప్రచారంపై ప్రధానంగా చర్చించారు. సీమాంధ్రలో రెండు రోజుల పాటు నరేంద్ర మోడీ, చంద్రబాబు కలిసి చేపట్టే ఎన్నికల ప్రచారంపై సమాలోచనలు జరిపారు. భేటీ అనంతరం బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాదులో టిడిపి, బిజెపి కూటమి అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందన్నారు.
28, 29న చిత్తురులో నారా రోహిత్
టిడిపి తరఫున ఇప్పటికే నటులు బాలకృష్ణ, తారక రత్న తదితరులు ప్రచారం చేస్తున్నారు. తాజాగా నారా రోహిత్ జత కలవనున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ప్రముఖ హీరో, చంద్రబాబు సోదరుడి తనయుడు నారా రోహిత్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. ఆయన 28, 29 తేదీల్లో చిత్తూరు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారు.
మోడీ హవా
దేశంలో నరేంద్ర మోడీ హవా ఉందని, ఆయనను ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని భారతీయ జనతా పార్టీ జాతీయనేత వెంకయ్య నాయుడు అన్నారు. ఓటమి తప్పదన్న నైరాశ్యం, నిస్పృహలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్కు మద్దతిచ్చే పార్టీలకు ఓటు వేయరాదని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు నాటకాలాడుతున్నాయన్నారు. వీరికి ఓటు వేసే విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకయ్య అన్నారు. ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ఓటు వేయవద్దన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు.