ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: తిరుమల వచ్చే భక్తులు, సిబ్బంది 400 మందికి రోజూ కరోనా పరీక్షలు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే భక్తులు, ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజు 400 మందికి టెస్టులు నిర్వహిస్తామని.. ఇందులో 200 మంది భక్తులు ఉంటారని.. మిగతావారు సిబ్బంది అని తెలిపింది. ప్రతీరోజు 400 మందికి పరీక్షలు చేస్తామని వెల్లడించింది. ఇటీవల జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో.. తిరుమలకు వచ్చే భక్తులకు పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా టెస్టులు చేస్తే మంచిదని చెప్పడంతో ఆ దిశగా టీటీడీ ముందుకెళ్తుంది.
బిగ్ షాక్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్...
గురువారం నుంచి దర్శనం
లాక్ డౌన్ తర్వాత గురువారం నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తోన్న సంగతి తెలిసిందే. అంతకుముందు మూడురోజులు ఉద్యోగులు, సిబ్బంది, కుటుంబసభ్యులతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. తిరుమలకు వచ్చే భక్తులకు అలిపిరి వద్ద థర్మల్ స్కాన్ చేస్తున్నారు. అలాగే 100 మంది భక్తుల నుంచి ఇక్కడే రక్త నమూనాలను సేకరిస్తారు. మిగతా 100 నుంచి తిరుమల కొండపై సేకరిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ రక్తనమూనాలను సేకరించే వారు లక్షణాలు ఉన్న/ఇప్పటికే వైరస్ సోకి తగ్గుముఖం పట్టినవారిని పరీక్షిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
8 గంటల్లో రిపోర్ట్
శాంపిల్స్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్స్కు పంపిస్తామని.. ఫలితాలు కనీసం 6 నుంచి 8 గంటల్లోపు వస్తాయని తెలిపారు. వేగంగా ఫలితం రావడంతో.. ఒకవేళ భక్తుడికి పాజిటివ్ సోకిందని తెలితే.. వెంటనే అతనిని/ఆమెను తిరుపతి కోవిడ్-19 ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న తమిళనాడు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Recommended Video
6 వేల మంది భక్తులు
ఆలయం లోపల భౌతికదూరం పాటిస్తారని, మాస్క్ వేసుకొని ఉంటారని ఈవో తెలిపారు. ఆలయాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నామని కూడా వివరించారు. వైరస్ వల్ల రోజుకు టీటీడీ 6 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తోంది. అంతకుముందు రోజుకు స్వామివారిని 60 వేల మంది దర్శించుకునేవారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్లో టికెట్లు కొనుగోలు చేయాలని, లేదంటే అలపిరి వద్ద తీసుకోవాలని సూచిస్తున్నారు.