రంగారెడ్డిలో హైడ్రామా: తెరాస ఖాతాలోకి వరంగల్
కాంగ్రెస్, టిడిపి ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు ప్రతిపాదనలను ఇరు పార్టీ మధ్య చెర్చలు జరుగుతున్నాయి. జెడ్పీ పీఠాన్ని చెరో రెండేళ్లు పంచుకోవాలనేది మొదటి ప్రతిపాదన కాగా, మహబూబ్నగర్, వరంగల్ జెడ్పీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్కు, టిడిపి సహకరిస్తే, అందుకు ప్రతిఫలంగా రంగారెడ్డి జెడ్పీ పీఠం టిడిపికి దక్కేలా కాంగ్రెస్ సహకరించాలనేది రెండో ప్రతిపాదనగా తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రతిపాదనలపై చర్చలు కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెసు, టిడిపి జడ్పిటీసిలు గైర్హాజరయ్యారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది.
ఇదిలావుంటే, వరంగల్ జడ్పీ చైర్మన్ పదవి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఖాతాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 50 జడ్పీటిసి స్థానాలు ఉండగా, కాంగ్రెసు 24 స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి ఆరు స్థానాలున్నాయి. టిడిపి మద్దతుతో జడ్పీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలని కాంగ్రెసు భావించింది.
అయితే, కాంగ్రెసుకు వ్యతిరేకంగా పరిస్థితి మారిపోయింది. 18 జడ్పిటీసి స్థానాలు గెలుచుకున్న తెరాస చైర్మన్ పదవిని కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పది మంది కాంగ్రెసు జడ్పిటీసీలు, నలుగురు టిడిపి జడ్పీటీసిలు తెరాసకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీంతో వరంగల్ జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.