20మంది మహిళల్ని!.. ఫేస్బుక్తో ట్రాప్, లోబర్చుకుని డబ్బు గుంజాడు..
హైదరాబాద్: ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ.. వారి నుంచి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడు రంగస్వామి ఎట్టకేలకు రాచకొండ పోలీసులకు చిక్కాడు. ఇతని వలలో చిక్కుకుని సుమారు 20మంది మహిళల వరకు మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. వీరంతా ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలేనని, బయటకొస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇలా వెలుగులోకి:
తన వద్ద రూ.3లక్షల వరకు గుంజడమే కాక, పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ లాలాగూడ పోలీసులను ఆశ్రయించడంతో రంగస్వామి రాసలీలలు బయటపడ్డాయి.
అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ లేదా రేపు లాలాగూడ పోలీసులకు అతన్ని అప్పగించే అవకాశం ఉంది.
ఒంటరి మహిళలను లోబరుచుకుని..:
ఐదవ తరగతి వరకే చదివిన రంగస్వామి(28) స్వగ్రామం అనంతపురం జిల్లా బుక్కరాయపట్నం. 15ఏళ్ల నుంచే ఇతను నేరాలకు అలవాటుపడ్డాడు.
చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చిన రంగస్వామి జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను అనుసరించాడు. ఇదే క్రమంలో పలువురు ఒంటరి మహిళలను లోబరుచుకుని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజాడు.
ఇలా ట్రాప్ చేస్తాడు..:
ఫేస్బుక్ ద్వారానే రంగస్వామి చాలామంది ఒంటరి మహిళలకు వలవేసినట్టు తెలుస్తోంది. భర్తలకు దూరంగా ఉండే మహిళలకు చాటింగ్స్ ద్వారా దగ్గరై.. శారీరక సంబంధం దాకా వెళ్లేవాడు. అలా సాన్నిహిత్యం పెరగ్గానే.. వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడు. భారీ మొత్తంలో డబ్బు గుంజి ఆపై కనిపించకుండా పోయేవాడు. ఎట్టకేలకు ఓ బాధితురాలు ధైర్యం చేసి అతనిపై కేసు పెట్టడంతో అతని లీలలన్ని బయటపడ్డాయి.
గతంలోనూ కేసులు:
గతంలో నాచారం పరిధిలోని మల్లాపురంలో ఒక ఆటో డ్రైవర్ హత్య కేసులో రంగస్వామి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కుషాయిగూడలో ఒక మహిళపై అత్యాచారం జరిపిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. లగ్జరీ లైఫ్ గడపటం కోసం ఎక్కువగా ఒంటరి మహిళల్నే టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అతని నుంచి మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.