మధ్యంతర నివేదిక: రిషికేశ్వరి ర్యాగింగ్ వల్లే చనిపోయింది, ఎవరెవరు?
హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యార్ధని రిషికేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని కమిటీ తేల్చింది. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రమణ్యం తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్టు సమచారం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు అందజేశారు. నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఐదు రోజుల పాటు దర్యాప్తు చేసిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు.
ఎలాంటి పరిస్ధితులు రిషికేశ్వరిని ఆత్మహత్య వైపుకి మళ్లించాయో దానికి సంబంధించిన సేకరించిన ప్రాథమిక ఆధారాలను ఆయనకు వివరించారు. ఆయన వివరించిన అంశాలతో మధ్యంతర నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.
అంతేకాదు రిషికేశ్వరి ఆత్మహత్యకు ఎవరెవరు కారణమనే విషయాన్ని కూడా బాల సుబ్రమణ్యం ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు వివరించారు. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనకు పాల్పడిన వారిపై సీఎస్కు బాల సుబ్రమణ్యం కమిటీ వివరించడంతో యూనివర్సిటీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇటీవలే విచారణ కమిటీ ముందు హాజరైన ప్రిన్సిపాల్ బాబూరావు, హాస్టల్ వార్డెన్ యూనివర్సిటీలో ర్యాంగింగ్ జరుగుతున్న మాట వాస్తవమేనని కమిటీ ముందు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ప్రిన్సిపాల్ బాబూరావు మాత్రం రిషికేశ్వరి తల్లిదండ్రులు ర్యాగింగ్పై తనకు ఫిర్యాదు చేయలేదని కూడా పేర్కొన్నారు.
డ్యాన్స్ వీడియోపై స్పందిస్తూ విద్యార్ధులు అడిగితేనే డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో ఎవరిని బాధ్యులను చేస్తారు. ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ బాబూరావునా లేదా యూనివర్సిటీ హాస్టల్ వార్డెన్ స్వరూపారాణా? అనేది తెలియాల్సి ఉంది. విద్యార్థిని ఆత్మహత్య, ర్యాగింగ్ అంశాలపై నాగార్జున యూనివర్సిటీలో వారిద్దరినీ ప్రశ్నించారు.
ఇప్పటికే రిషికేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్టు చేసి, గత శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రిషితేశ్వరి అమాయకురాలని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరెవరి చర్యలు కారణమనే వివరాలతో బాలసుబ్రహ్మణ్యం త్వరలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను ఏపీ ప్రభుత్వానికి సమర్పించనున్నారు.